డిసిసిబి వ్యాపార పరిధిని మరింత విస్తరించాలి… జేసీ
1 min read
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మహాజనసభ
సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు వ్యవసాయ సీజన్ లో పంట రుణాలు అందించాలి
జాయింట్ కలెక్టర్,డిసిసిబి ప్రత్యేక అధికారి పి.ధాత్రిరెడ్డి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రత్యేక అధికారి పి.ధాత్రిరెడ్డి అన్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మహాజన సభ స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో బుధవారం జేసీ మరియు డిసిసిబి ప్రత్యేక అధికారి ధాత్రిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జేసీ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు వ్యవసాయ సీజన్ సమయంలో పంట రుణాలు అందించాలని, రైతులు దరఖాస్తు చేసిన 20 రోజులలలోగా రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో వ్యాపార కార్యకలాపాలను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరించాలన్నారు. డిసిసిబి వ్యాపార పరిధిని మరింత విస్తరించి, బ్యాంకును మరింత అభివృద్ధి చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల నుండి రుణాల రికవరీలు నూరుశాతం ఉన్నాయని, వారి స్వయం ఉపాధికి రుణాలను అందించి మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని జేసీ సూచించారు. నిరర్ధక రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి రుణాల వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. రుణాలను సక్రమంగా చెల్లించే ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ర్యాంకింగ్ విధానాన్ని అమలు చేస్తామని, వారికి వడ్డీలో కొంత మొత్తం రాయితీపై రుణాలను అందిస్తామన్నారు. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబందించిన రాబడి, వ్యయాలను ఆమోదించారు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబందించిన బడ్జెట్ ప్రతిపాదనలను కూడా సభలో ఆమోదించారు. సమావేశంలో జిల్లా సహకార శాఖాధికారి ఏ . శ్రీనివాస్, డిసిసిబి సీఈఓ సింహాచలం, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రతినిధులు, సహకార శాఖ పర్సన్ ఇంచార్జ్ లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.