రైతులకు సబ్సిడీ ఎరువులు విత్తనాలు ఇవ్వాలి
1 min read
తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన సీపీఎం
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : రైతులకు సబ్సిడీ కింద ఎరువులు విత్తనాలను వెంటనే ఇవ్వాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.బుధవారం నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో నాగేశ్వర రావు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులవుతునన్నా ఇంతవరకు రైతులకు ఎరువులు విత్తనాలు సబ్సిడీ కింద ఇవ్వలేదని రైతుల పెట్టుబడి సాయం కోసం రైతు సుఖీభవ ద్వారా ఇస్తామన్న 20 వేల రూపాయలు ఇవ్వకుండా కాలయాపన చేయడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారని అన్నారు. కలమందల పాడు గ్రామ రైతులకు గత వైకాపా ప్రభుత్వ హయాంలో 22 మందికి పట్టాలు మంజూరు చేశారు కానీ ఇంతవరకు భూములు చూపించలేదని వాటి మూలంగా నేడు సోలార్ కంపెనీ వాళ్ళు దౌర్జన్యంగా ఇష్టానుసారంగా రైతులకు ఇచ్చిన భూముల్లో రాస్తాలు ఏర్పాటు చేస్తున్నారని వారు ఆరోపించారు.సోలార్ కంపెనీ వారిని వెంటనే పిలిపించి రైతులకు నష్టం జరగకుండా చూడాలని వారు కోరారు. అలగనూరు రిజర్వాయర్ గండి నిర్మాణ పనులు చేపట్టాలని మరియు హంద్రీనీవా ద్వారా మిడుతూరు మండలానికి సాగు తాగునీరు అందించేందుకు వెంటనే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.మిడుతూరు మండలంలో దళితులకు ఇచ్చిన పట్టాలకు భూములు చూపాలని వారు డిమాండ్ చేశారు.తర్వాత సమస్యలు పరిష్కరించాలని తహసిల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు.సోలార్ కంపెనీలో రైతులు నష్టపోకుండా చూస్తామని తహసిల్దార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణ మద్దిలేటి రామకృష్ణ రమణయ్య హరి నాయుడు తిరుపాలు టైలర్ బాబు పాల్గొన్నారు.