మంత్రాలయం ఆర్టీసీ బస్టాండ్ దశలవారీగా అభివృద్ధి
1 min read
కడప ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు
మంత్రాలయం , న్యూస్ నేడు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రెండవ తిరుపతిగా పేరుగాంచిందని కడప ఆర్టీసీ జోనల్ చైర్మన్ పోల నాగరాజు అన్నారు. ఆదివారం ఆర్టీసీ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రాలయం బస్టాండ్ ను దశలవారీగా అభివృద్ధి చేస్తామని, ఎంతో అద్బుతమైన ప్రదేశమని దేశంలోని ఎన్నో రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలోని బస్టాండ్ లపైన దృష్టి పెట్టారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థలు సహకారంతో యాత్రికులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని ఉద్దేశంతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. మంత్రాలయం నుంచి పంచముఖి, ఉరుకుందు, తుంగభద్ర రైల్వే స్టేషన్, ఆదోని, తిరుపతి తో పాటు వివిధ దూర ప్రాంతాల కు బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. అలాగే కడప జోన్ తిరుపతి, కర్నూలు, అనంతపురం జిల్లాలకు మొత్తం 250 ఈ బస్సులు మంజూరు చేయటం జరిగిందని తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి సహకరిస్తున్నారన్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థల వారిని కూడా కలవడం జరిగిందని. వారు మంత్రాలయం బస్టాండ్ అభివృద్ధికి సహకరిస్తామన్నారని తెలిపారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మహిమలు దేశం మొత్తం వ్యాప్తి చెందిందని దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు బస్టాండ్ లో తాగునీటి సదుపాయం, మరుగు దొడ్లుతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించి బస్టాండ్ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు డిపో మేనేజర్ మద్దిలేటి , అసిస్టెంట్ మల్లయ్య తదితరులు ఉన్నారు.