సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం…
1 min read
చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేస్తున్న అంగన్వాడీ టీచర్లు
చాగలమర్రి, న్యూస్ నేడు : మండల కేంద్రమైన చాగలమర్రి లోని అంగన్వాడి కేంద్రాలలో గురువారం అంగన్వాడి టీచర్లు చిన్నపిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం వేద పండితుల సమక్షంలో వేదమంత్రాల మధ్య చేయించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ ఐసిడిఎస్ ఆళ్లగడ్డ ప్రాజెక్ట్ సిడిపిఓ తేజస్విని, మండల సూపర్వైజర్ సుశీల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంగన్వాడి పిలుస్తోంది అనే కార్యక్రమం ద్వారా అంగన్వాడి బడి ఈడు పిల్లలను అంగన్వాడి రికార్డులలో నమోదు చేసుకుంటున్నామన్నారు. ఇంటింటా వెళ్లి అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులను చేర్పించాలని అవగాహన కల్పిస్తున్నామన్నారు. పూర్వ ప్రాథమిక విద్యనుంచే ఉన్నత శిఖరాలను అధిరోహించుటకు అంగన్వాడి కేంద్రాలే పునాదులు అన్నారు. ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు, అంగన్వాడి కేంద్రాలలో వైద్య సేవలతో పాటు టీకాలు వేయించడం జరుగుతుందన్నారు. అంగన్వాడి కేంద్రాల నుంచి ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టికాహారాన్ని కూడా సకాలంలో పొందాలన్నారు. మాత శిశు సంరక్షణ ఐసిడిఎస్ లక్ష్యం అని వారు తెలిపారు. సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు చంద్రకళ, హసీనా, వహీదా, ఇందుమతి, కాకి సుజాత, మై మాన్, మా బు చాన్, రహమత్, సువర్ణ, కళావతి, రెహనా, అంగన్వాడి సహాయకులు మేరీ, సుజాత, మా బు చాన్, దిల్షాద్ ,గుర్రమ్మ , అంగన్వాడి కేంద్రాల లబ్ధిదారులు, వారి పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
