ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో మంత్రి లోకేష్ భేటీ!
1 min read
న్యూఢిల్లీ న్యూస్ నేడు : భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏడాదిపాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మరింత వేగవంతమైన అభివృద్ధికి మీ వంతు సహాయ, సహకారాలను అందించాలని కోరారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనికి ఉపరాష్ట్రపతి ధన్కర్ స్పందిస్తూ అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ధన్కర్ వాకబు చేయగా, రూ.64వేల కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించామని, పనులు వేగంగా పూర్తిచేస్తామని లోకేష్ చెప్పారు. ఈనెల 21వతేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమంతో చరిత్ర సృష్టించబోతోందని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశానికి గత 40ఏళ్లలో ఎప్పుడూ గెలవని మంగళగిరిని తాను ఎంచుకున్నానని లోకేష్ చెప్పగా, తాను కూడా తొలిసారి పరిచయం లేని నియోజకవర్గాన్నే ఎంచుకొని పోరాడానని ధన్కర్ అన్నారు. ఈ సందర్భంగా 226 రోజులపాటు 3,132 కి.మీ.ల మేర తాను చేసిన పాదయాత్రలో ఎదురైన అనుభవాలను కళ్లకుకడుతూ రూపొందించిన యువగళం పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి అందజేశారు. పాదయాత్ర ద్వారా ఎపి ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేష్ ను ఉపరాష్ట్రపతి ధన్కర్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, కేశినేని చిన్ని, పెమ్మసాని చంద్రశేఖర్, బస్తిపాటి నాగరాజు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, సానా సతీష్, శబరి పాల్గొన్నారు.