విద్య పట్ల ఆసక్తి ఉన్న వారికి ఓపెన్ స్కూల్ చక్కని సువర్ణ అవకాశం
1 min read
పది మరియు ఇంటర్మీడియట్ కోర్సులకు జూలై 30వ తేది వరకు ఆన్లైన్ దరఖాస్తుకు అవకాశం
ఆలస్య రుసుముతో ఆగస్టు 1 నుండి 15 వరకు దరఖాస్తు చేయవచ్చు
జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్
నంద్యాల, న్యూస్ నేడు : విద్య పట్ల ఆసక్తి ఉన్న విద్యార్ధులు, ఉద్యోగులు, గృహిణులు ఓపెన్ స్కూల్ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యావంతులు కావాలని జిల్లా రెవెన్యూ అధికారి డి.రామునాయక్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై సంబంధిత అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దూర విద్యా విధానంలో 10 మరియు ఇంటర్మీడియట్ కోర్సులను విజయవంతంగా నిర్వహిస్తోందన్నారు. ఈ విద్యాపీఠం జారీ చేసే సర్టిఫికెట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందియుండి, ఉన్నత చదువులకు మరియు ఉద్యోగాలు పొందుటకు అర్హత కలిగి ఉంటుందన్నారు. పది మరియు ఇంటర్మీడియట్ దూరవిద్య నిమిత్తం ఈనెల 12 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారని… జూలై 30 చివరి తేదీలోగా https://apopenschool.ap.gov.in సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. ఆలస్య రుసుము రూ.200/-లతో ఆగస్టు 1 నుండి 15వ తేది వరకు కూడా ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చునన్నారు. పదవ తరగతిలో నమోదు చేసుకోవడానికి ఎటువంటి విద్యార్హత అవసరం లేదని 14సం.లు పైబడి చదవడం, వ్రాయడం వస్తే సరిపోతుందన్నారు. ఇంటర్మీడియట్ కు మాత్రం పదవ తరగతి పాస్లేదా ఫెయిల్ అయిన వారు అర్హులన్నారు. ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలకు కలిపి ఒకే సారి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. ఇందుకు జిల్లాలోని వివిధ మండలాల్లో 25 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు అన్ని పోటీ పరీక్షలు వ్రాయడానికి అర్హులని తెలిపారు. రెగ్యులర్ విధానంలో పాఠశాల, కళాశాలకు వెళ్లడానికి ఇబ్బంది పడేవారు సెలవు రోజుల్లో, ఆదివారాల తరగతులు నిర్వహించడం జరుగుతోందన్నారు. విద్యార్థుల సౌలభ్యం కోసం ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్షలు వ్రాసే అవకాశం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలు, మైనార్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు రాయితీ పొందే అవకాశం ఉందన్నారు. చదువు మధ్యలో ఆపేసిన వారికి ఇదొక సువర్ణ అవకాశం అని ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు.పోలీసు శాఖ, ఎంపిడిఓలు, పంచాయతీ కార్యదర్శులు, తహశీల్దార్లు, విఆర్ఓలు, మెప్మా, డిఆర్డిఎ, ఐసిడిఎస్, డ్వామా, వైద్య శాఖలు క్రింద స్థాయి సిబ్బందితో పాటు విద్య పట్ల ఉత్సుకత ఉన్న వారికి అవగాహన కల్పించాలన్నారు. వయోజన విద్యా శాఖ వాలంటీర్ల ద్వారా అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రధాన కూడళ్ల వద్ద ఓపెన్ స్కూల్ కు సంబంధించి బ్యానర్స్, పోస్టర్లను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు డిఆర్ఓ సూచించారు. అదే విధంగా అన్ని అసంఘటిత రంగ కార్మికులు మరియు వారి కుటుంబాలతో కలిసి నమోదును ప్రోత్సహించాలని కార్మిక శాఖ అధికారిని, పాఠశాలలో డ్రాపౌట్లను గుర్తించి, వారిని ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల వైపు ప్రోత్సహించేలా పాఠశాల యాజమాన్యం, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లతో అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సమగ్ర శిక్ష అధికారులు సమన్వయం చేసుకోవాలని డిఆర్వో పేర్కొన్నారు.ఈ సమావేశంలో డిఈఓ జనార్ధన్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.