PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పిట్టగోడపై రామ్‌..భీమ్‌

1 min read

సినిమా డెస్క్​ : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సుమారు రూ.450కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా విడుదలకు సమయం కూడా దగ్గరపడుతోంది. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? ఎప్పుడు థియేటర్‌కు వెళ్లి ఈలలు వేసి గోల చేద్దామా? అని అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ మాత్రం హాయిగా సినిమా సెట్లో కాలక్షేపం చేస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో షూటింగ్‌కు మధ్యలో దొరికిన కాస్త విరామ సమయంలో తన హీరోలతో జక్కన్న సరదాగా సమయం గడిపారు. చరణ్‌, తారక్‌ పిట్టగోడ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న దృశ్యాలను రాజమౌళి ఒక డమ్మీ కెమెరాతో చిత్రీకరిస్తున్నట్టు కనిపించారు. ఈ వీడియోను ఆర్ఆర్‌ఆర్‌ టీమ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌‌ చేసింది. అయితే.. ఆ వీడియోలో ఎన్టీఆర్‌ మొహంపై గాయం అయినట్లు కనిపిస్తోంది. బహుశా షూటింగ్‌లో భాగంగా చిన్న గాయమై ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్‌ఆర్ఆర్‌ టీమ్‌ ఉక్రెయిన్‌లో షూటింగ్‌తో బిజీగా ఉంది. ఈ సినిమాతో మరోసారి కీరవాణి రాజమౌళితో కలిసి పనిచేస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్‌ 13 ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఇటీవల విడుదలైన ‘దోస్తీ’ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ అవుతోంది.

About Author