యోగా ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకోండి
1 min read
నంద్యాల ఇండోర్ స్టేడియంలో మాస్ డెమో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: ప్రతి రోజు యోగాసనాలు ఆచరించి మానసిక ఒత్తిడికి దూరం కావాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. ఈనెల 21వ తేది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో మాస్ డెమో యోగా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, డిఎంహెచ్ఓ డా. వెంకటరమణ, ఆయుష్ శాఖ సీనియర్ మెడికల్ అధికారి డా. యశోధర వివిధ యోగ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ ప్రతిరోజు యోగాను ఆచరించి శారీరికంగా, మానసికంగా, ఉల్లాసంగా, జీవితంలో ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు జిల్లా, మున్సిపల్, మండల, గ్రామ స్థాయిలో నెల రోజుల పాటు యోగాంధ్ర-2025 కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. జూన్ 21వ తేది అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి విశాఖపట్నంలో పాల్గొంటున్నారని… అదే సమయంలో జిల్లా అంతటా గుర్తించిన ప్రదేశాలలో యోగా కార్యక్రమాల నిర్వహణకు మాస్ డెమో కార్యక్రమాన్ని చేపట్టామని కలెక్టర్ తెలిపారు. ఇందుకు సంబంధించి యోగ గురువుల ద్వారా అన్ని మండల కేంద్రాలలో శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు.జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ మాట్లాడుతూ యోగాను ప్రతి ఒక్కరు ఆచరించి జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. అనంతరం ఆనంద్ గురూజీ బృందం కార్యక్రమంలో పాల్గొన్న వారిచే యోగసనాలు వేయించారు.
