NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్య ద్వారానే సమస్యలన్నిటికీ పరిష్కారం!

1 min read

నైతిక విలువలతో జీవితంలో ఉన్నతస్థానాలకు ఎదగండి

ఉన్నత లక్ష్యాలతో దేశ సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కండి

కృష్ణా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేష్

మచిలీపట్నం, న్యూస్ నేడు: సమాజంలో అన్ని సమస్యలకు విద్య పరిష్కారం చూపుతుంది, ప్రపంచాన్ని మార్చగల సామర్థ్యం, సత్తా మీకు ఉన్నాయి, ఇక్కడి నుండే విద్యార్థులు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… కేవలం గ్రాడ్యుయేషన్ తో నేర్చుకోవడం ఆగిపోకూడదు, అది జీవితాంతం కొనసాగాలి. మీరు ఉపగ్రహాలను నిర్మించాలని, సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని, హరిత భవనాలను రూపొందించాలని, స్టార్టప్‌ను ప్రారంభించాలని, గ్రామీణ భారతదేశాన్ని శక్తివంతం చేయాలని కలలు కని ఉండొచ్చు. ఈ డిజిటల్ యుగంలో జ్ఞానానికి మించిన సంపద లేదు. మీరు మీ కెరీర్‌లలో ఎదుగుతున్నప్పుడు విలువలను ఎప్పుడూ కోల్పోకండి.  ఆంధ్రప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఎస్. అబ్దుల్ నజీర్  గొప్పతనాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేయాలని భావిస్తున్నాను. న్యాయం, రాజ్యాంగ విలువలు, సమానత్వం, విద్య పట్ల ఆయనకున్న లోతైన నిబద్ధత మన రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలవైపు నడిపిస్తోంది. క్రమశిక్షణ, సంకల్పం ఈ ఆడిటోరియంలోని ప్రతి యువకుడికి ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుంది. ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ స్థాపన వెనుక ఆయన మార్గనిర్దేశక శక్తిగా ఉన్నారు. ధైర్యం, వ్యక్తిత్వంతో  అత్యున్నత స్థాయికి ఎదగగలరని చెప్పడానికి ఆయన జీవితం ఉదాహరణ.

 పట్టభద్రుల జీవితాల్లో కొత్త అధ్యాయం

పట్టభద్రుల జీవితాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు డిగ్రీలు అందుకుంటున్న గ్రాడ్యుయేట్లందరికీ హృదయపూర్వక అభినందనలు. మీ డిగ్రీ కేవలం ఒక సర్టిఫికేట్ మాత్రమే కాదు – అది ఒక బాధ్యత. మీ జ్ఞానాన్ని సమాజ హితం కోసం ఉపయోగించడం, అన్యాయాన్ని ప్రశ్నించడం, నవీన ఆవిష్కరణలు చేయడం, విలువలకు కట్టుబడి ధైర్యంతో ముందుకు సాగడం మీ బాధ్యత. మీరంతా సమాజానికి దిక్సూచిగా నిలచే అధ్యాపకులుగా, పరిశోధకులుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం స్ఫూర్తితో మీ కలలను సాకారం చేసుకుంటూ భారతదేశ సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ఈ దేశాన్ని ముందుకు నడిపించే మార్గనిర్దేశకులుగా తయారు కావాలని కోరుకుంటున్నాను.

అధునాతన సాంకేతికలపై దృష్టిపెట్టండి

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ తో సమాజంలోని అన్నిరంగాల్లో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాతావరణ మార్పులను పసిగట్టడం, ఆరోగ్య సంరక్షణతోపాటు బయోటెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణల ద్వారా మానవ ఆయుర్దాయం పెంచే పరిశోధనలు జరుగుతున్నాయి. సాంప్రదాయ విలువలను గౌరవిస్తూ సృజనాత్మకతతో నైతిక నాయకత్వాన్ని పెంపొందించుకోవాలి.  జీవితంలో స్థిరపడేందుకు మీ అభిరుచికి తగ్గట్లుగా ఏ మార్గాన్నయినా ఎంచుకోండి,  లక్ష్యాన్ని చేరుకునేందుకు బాధ్యతతో ధైర్యంగా ముందుకు సాగండి.

 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ మెరుగుపర్చాలి

కృష్ణా విశ్వవిద్యాలయం 2008 లో స్థాపించబడింది.  ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయంలో 2000 మంది విద్య నభస్యసిస్తుండగా, 134 అనుబంధ కళాశాలలలో సుమారు 30,000 మంది విద్యార్థులకు సేవలు అందిస్తోంది. 2024-25లో కృష్ణా వర్సిటీ క్యాంపస్ లో విద్యనభ్యసించిన విద్యార్థులు 100% ప్లేస్‌మెంట్ సాధించిన విషయం తెలుసుకుని ఎంతో ఆనందించాను. అయితే అనుబంధ కళాశాలలు గత విద్యా సంవత్సరంలో 50-60% ప్లేస్‌మెంట్‌ మాత్రమే సాధించాయి. 2017లో విశ్వవిద్యాలయం ఎన్​ఐఆర్​ఎఫ్​ 151-200 బ్యాండ్‌లో స్థానం సంపాదించినప్పటికీ, ఇటీవలి సంవత్సరాలలో ర్యాంకింగ్ లో  వెనుకబడింది. ఎన్​ఐఆర్​ఎఫ్​ ర్యాంకింగ్‌ను వెంటనే 100 కంటే తక్కువకు తీసుకురావాలని నేను వర్సిటీ పాలకమండలిని మంత్రి నారా లోకేష్ కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *