మత్స్య సంపద అభివృద్ధికి కృషి చేయండి
1 min read
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: జిల్లాలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని పటిష్టంగా అమలు పరుస్తూ మత్స్య సంపద అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. బుధవారం కలెక్టర్ నెంబర్ లో ప్రధానమంత్రి మత్స్య సంపద అమలుపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, రిజర్వాయర్లలో చేపల ఉత్పత్తికి పటిష్ట చర్యలు తీసుకుంటూ మత్స్య సంపద అభివృద్ధికి కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పథకం ఫలితంగా చేపపిల్లల ఉత్పత్తిని స్థానికంగా పెంచటం ద్వారా రైతులు, మత్స్యకారులకు ప్రత్యక్ష లాభం చేకూరుతుందని తద్వారా గ్రామీణ ప్రాంతాల ఆర్థిక స్థితి మెరుగుపడి సర్వాంధ్ర ప్రగతికి దోహదపడుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఈ పథకం కింద నమోదైన 224 మంది లబ్ధిదారులలో ఇప్పటివరకు 129 యూనిట్లు భౌతికంగా స్థాపించబడ్డాయి. మిగిలిన 95 యూనిట్లను కూడా త్వరితగతిన అమలు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.కేంద్ర ప్రభుత్వం సూచించిన మేరకు రాష్ట్రంలోని చేపల ఉత్పత్తిని 15% నుండి 30% వరకు పెంచే లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని, జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా, చేపపిల్లల కొరతను దృష్టిలో ఉంచుకొని నంద్యాల ప్రభుత్వ మత్స్య క్షేత్రాన్ని పథకం క్రింద అభివృద్ధి చేయాలని, అలాగే 7.5 ఎకరాల తంగడంచ మత్స్య క్షేత్రాన్ని మరింత విస్తరించాలని కలెక్టర్ సూచించారు.అదేవిధంగా, వెలుగోడు రిజర్వాయర్ ప్రాంతంలో 15 ఎకరాలలో నూతనంగా చేపపిల్లల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేసి, జిల్లాలో చేపపిల్లల ఉత్పత్తిని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో క్యాప్టివ్ సీడ్ నర్సరీలు ఏర్పాటు చేసి, మత్స్య సంఘాలు మరియు లాభసాటి సమూహాల ద్వారా స్వయం పెంపకం ద్వారా లబ్ధిదారులు స్వావలంబన సాధించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా మత్స్య సంపద అధికారి రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.