శాయి స్పోర్ట్స్ హాస్టల్ కర్నూలు నుండి తరలించే ప్రసక్తే లేదు.. మంత్రి
1 min read
కర్నూలులో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు.. మంత్రి
కర్నూలు, న్యూస్ నేడు: శాయి స్పోర్ట్స్ హాస్టల్ కర్నూలులోనే ఉంటుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా, ఎంపీ బస్తిపాటి నాగరాజు, శాప్ ఛైర్మన్ రవినాయుడు చెప్పారు. కర్నూలు నగరంలోని అవుట్ డోర్ స్టేడియంలో సమ్మర్ కోచింగ్ క్యాంపును సందర్శించారు. క్రీడాకారులతో మాట్లాడి సరదాగా కాసేపు క్రీడల్లో పాల్గొన్నారు. అనంతరం క్రీడాకారుల హాస్టల్లో జరుగుతున్న మరమ్మతు పనులు మంత్రి పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాదాన్యత ఇస్తోందన్నారు. కర్నూలులో ఉన్న శాయి స్పోర్ట్స్ హాస్టల్ ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడం లేదన్నారు. అవసరమైతే కర్నూలుకు ఏమైనా తీసుకురావడమే తప్ప కర్నూలు నుండి తీసుకెళ్లడం జరగదన్నారు. ఇక క్రీడలకు తమ టీజీవీ గ్రూప్స్ నుండి ఎంతో సహకారం అందిస్తున్నట్లు గుర్తు చేశారు. అవుట్ డోర్ స్టేడియంను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు, వాకర్స్ కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. దీంతో పాటు నగరంలోని పార్కులను సైతం వ్యాయామానికి అనుకూలంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని మంత్రి కోరారు.

