ఉపాధి కూలీలకు వేసవి వసతులు కల్పించాలి
1 min read
200 రోజుల పని దినాలకు పెంచాలి..
నందికొట్కూరు న్యూస్ నేడు: ఉపాధి హామీ పథకం కూలీలకు కుటుంబానికి రెండు వందల రోజుల పని దినాలు కల్పించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని తర్తూరు గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ఉపాధి కూలీలకు వేసవి అలవెన్స్, పనిముట్లు,కనీస వసతులు కల్పించాలని అన్నారు.ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు తీవ్ర విమర్శలు చేశారు.కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.నరేంద్ర మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే విధంగా చర్యలు తీసుకుంటోందని ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామీణ పేదలకు కల్పించాల్సిన హక్కులను నిర్వీర్యం చేస్తూ గ్యారెంటీ ఉపాధిని గ్యారెంటీ లేకుండా మార్చారని విమర్శించారు.పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీలకు రోజుకు కనీసం 6 వందల కూలీ చెల్లించాలని అన్నారు.గతంలో గడ్డపారకు, మంచినీటికి,గంపకు అదనపు చెల్లింపులు ఉండేవని, ప్రస్తుతం అవన్నీ రద్దు చేయడం వల్ల కూలీలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పనులు జరిగే ప్రదేశాల్లో తాగునీరు,నీడ, ప్రాథమిక వైద్య సదుపాయాలు,మెడికల్ కిట్లు వంటి కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. కూలీల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకురాలు నవ్వసాని,శ్రీరాములు, మరియు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

