దుగ్గిరాలలో స్ఫూర్తినిచ్చిన ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం
1 min read
స్వయంగా ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
కూటమి ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగస్వాములైన ఎమ్మెల్యే
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం పంచాయతీ కార్యదర్శుల బాధ్యత
చెత్తను బహిరంగంగా పడేయొద్దు,ప్రజలు కూడా స్వీయ బాధ్యత పాటించాలి
ఎమ్మెల్యే చింతమనేని పిలుపు
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో శనివారం ఉదయం ముమ్మర పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఈ శ్రమదాన కార్యక్రమంలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా క్షేత్రస్థాయిలోకి దిగారు.పారిశుద్ధ్య శ్రామికులతో కలిసి ఎమ్మెల్యే శ్రమదానoఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కేవలం ప్రసంగాలకో, ఫోటో ఫోజులకే పరిమితం కాకుండా, స్వయంగా పారిశుద్ధ్య శ్రామికులతో కలిసి నడిచారు. బహిరంగ ప్రదేశాలలో, రోడ్ల పక్కన పడేసి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, కవర్లను ఆయన స్వహస్తాలతో సేకరించారు. అనంతరం ఆ చెత్తను పంచాయతీ ట్రాక్టర్లు,వ్యర్థాల తరలింపు వాహనాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించేలా పర్యవేక్షించారు. ఎమ్మెల్యే స్వయంగా రోడ్లు ఊడుస్తూ, చెత్త ఏరుతుండటం చూసి స్థానికులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో శ్రమదానంలో భాగస్వాములయ్యారు.
అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక అధికారులతో సమీక్షించారు. గ్రామాల్లో ఎక్కడికక్కడ బహిరంగంగా ప్లాస్టిక్ వ్యర్థాలు పడకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత స్థానిక పంచాయతీ కార్యదర్శులదేనని స్పష్టం చేశారు. గ్రామాలను పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంతో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఉత్తమ పౌరులుగా ముందుకు సాగాలి
అనంతరం ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ “పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వం లేదా పారిశుద్ధ్య కార్మికుల బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి ఒక్కరి స్వీయ బాధ్యత. ప్రజలు ఇళ్లలోని చెత్తను బహిరంగ ప్రదేశాల్లో, కాల్వల్లో పడేయడం మానుకోవాలి. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ కలిగి ఉన్నప్పుడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మారుతుందని, సమాజంలో ఉత్తమ పౌరులుగా మన వంతు పాత్ర పోషించాలని” పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పంచాయతీ సిబ్బంది,కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.


