NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“మాతృత్వాన్ని మరువుతున్న సమాజం… ఎటు సాగుతోంది?”

1 min read

— సామాజిక చైతన్యానికి పిలుపు

కర్నూలు,న్యూస్​ నేడు:  నేటి సమాజంలో వేగంగా మారుతున్న జీవన విధానం, ఉద్యోగ ఒత్తిళ్లు, నగరీకరణ, స్వార్థపూరిత ఆలోచనలు వంటి అనేక కారణాల వల్ల కుటుంబ విలువలు క్రమంగా క్షీణిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం, ఒంటరితనం, ప్రేమాభిమానాల లోపం వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఈ నేపథ్యంలో “మాతృత్వాన్ని మరువుతున్న సమాజం… ఎటు సాగుతోంది?” అనే అంశంపై సామాజిక చైతన్యవాది కె. రామకృష్ణ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ సమాజానికి ఒక ఆత్మపరిశీలన సందేశాన్ని అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

“తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చి, జీవితాన్ని ఇచ్చిన మహనీయులు. వారు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వారిని భారంగా కాకుండా, మన జీవితానికి లభించిన గొప్ప ఆశీర్వాదంగా భావించాలి. వారి పట్ల ప్రేమ, గౌరవం, బాధ్యత ప్రతి ఒక్కరి నైతిక కర్తవ్యం.” అని పేర్కొన్నారు.అలాగే, సమాజ అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక పురోగతి, సాంకేతిక అభివృద్ధి మాత్రమే కాదని, కుటుంబ బంధాలు, మానవీయ విలువలు, పెద్దల పట్ల గౌరవం కూడా సమానంగా పెరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.వృద్ధాశ్రమాల సంఖ్య పెరగడం కంటే, వృద్ధులు తమ సొంత కుటుంబాల్లో ప్రేమతో జీవించే పరిస్థితులు ఏర్పడటమే నిజమైన సామాజిక అభివృద్ధికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.యువత తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలంటే, ముందుగా తమ తల్లిదండ్రులను గౌరవించే సంస్కృతిని ఆచరణలో చూపించాలని ఆయన పిలుపునిచ్చారు.”తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారితో సమయం గడపండి… వారు లేనప్పుడు వచ్చే పశ్చాత్తాపం ఏ ప్రేమనూ తిరిగి తీసుకురాదు.” అని ఆయన అన్నారు.చివరగా, ప్రతి కుటుంబం తల్లిదండ్రులను గౌరవించే సంస్కృతిని అలవర్చుకుని, మానవీయ విలువలను భావితరాలకు అందించాలని సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఆయన విజ్ఞప్తి చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *