22 నుండి స్పెషల్ క్యాంపెయిన్ డే
1 min read
నియోజకవర్గ ఓటర్లు సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
18 ఏళ్లు నిండిన పౌరులు ఓటరుగా నమోదు కావాలి
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఈఆర్వో, కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు, న్యూస్ నేడు: గురువారం భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్–2026 ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 22, 23 తేదీల్లో స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తున్నట్లు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఈఆర్వో, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గ ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని గురువారం ఒక ప్రకటనలో కోరారు.ఈ రెండు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఓటర్లు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవడంతో పాటు, కుటుంబ సభ్యుల పేర్లు కూడా పరిశీలించుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన పౌరులు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.ఓటరు జాబితాలో పేరు లేని వారు ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఓటరు జాబితాలో ఉన్న పేర్లలో తప్పులు, మార్పులు, సవరణలు ఉంటే ఫారం–8 ద్వారా, అనర్హులు, మరణించిన లేదా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్లకు సంబంధించి ఫారం–7 ద్వారా అభ్యంతరాలు, దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు.అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తున్నామని, ఓటర్లు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈఆర్వో, కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు.


