శ్రీ సిటీలో సిగ్మా ఏరోస్పేస్ ఉత్పత్తి ప్రారంభం
1 min read
ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో ఉత్పత్తిని ప్రారంభించినట్లు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కీలక విమాన విడిభాగాల తయారీ..
75 వేల చదరపు అడుగుల్లో తొలి దశ శ్రీ సిటీలో సిగ్మా మొత్తం 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏరోస్పేస్ తయారీ ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తోంది.
హైదరాబాద్, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీలో సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసిన ఏరోస్పేస్ తయారీ కేంద్రం ఉత్పత్తిని ప్రారంభించింది. నిర్మాణ పనులు మొదలైన ఎనిమిది నెలల్లోనే కేంద్రాన్ని ఉత్పత్తి దశకు తీసుకొచ్చింది. తొలి విడతలో తయారుచేసిన అత్యంత కచ్చితత్వంతో కూడిన ఏరోస్పేస్ విడిభాగాలను యూకేలోని సిగ్మా కేంద్రానికి పంపింది. అక్కడ తుది తనిఖీల అనంతరం కస్టమర్కు సరఫరా చేయనుంది. రోల్స్ రాయిస్ ఏరోస్పేస్తో చేపట్టిన తయారీ సోర్స్ చేంజ్ అనుమతి ప్రక్రియలో శ్రీ సిటీ కేంద్రం ప్రాథమిక దశలను పూర్తిచేసింది.
75 వేల చదరపు అడుగుల్లో తొలి దశ
శ్రీ సిటీలో సిగ్మా మొత్తం 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏరోస్పేస్ తయారీ ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తోంది. ఇందులో తొలి దశగా 75 వేల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని ఎనిమిది నెలల్లోనే అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ కేంద్రం ఏడాదికి లక్ష మ్యాచినింగ్ గంటల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీన్ని దాదాపు 3 లక్షల వార్షిక మ్యాచినింగ్ గంటలకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.యూకేలో సిగ్మాకు ఉన్న ఏరోస్పేస్ తయారీ సామర్థ్యాలను శ్రీ సిటీలోనూ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సంస్థ ముందుకు సాగుతోంది. మిగిలిన ప్రాంగణాన్ని వచ్చే 12 నెలల్లో అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో అదనపు తయారీ సామర్థ్యంతో పాటు ఏరోస్పేస్ రంగానికి కీలకమైన మరిన్ని ప్రక్రియలను భారత్లో చేపట్టే అవకాశం కలుగుతుంది. అన్ని సామర్థ్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే తయారీ ప్రక్రియలో దాదాపు 70 శాతం భారత్లోనే జరుగుతుందని సంస్థ తెలిపింది.ఈ సందర్భంగా సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కలిదిండి మాట్లాడుతూ.. ‘‘ఎనిమిది నెలల్లోనే గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టును నిర్మాణ దశ నుంచి ఉత్పత్తి దశకు తీసుకురావడం కీలక మైలురాయి. అంతర్జాతీయ ఏరోస్పేస్ కార్యక్రమాలకు అవసరమైన ప్రమాణాలతో భారత్లో విడిభాగాల తయారీ ప్రారంభించాం. యూకేలో ఉన్న తయారీ సామర్థ్యాలను భారత్లోనూ ఏర్పాటు చేసి, ఏరోస్పేస్ తయారీ విలువ గొలుసులో మరింత భాగాన్ని భారత్కు తీసుకురావడమే మా లక్ష్యం. శ్రీ సిటీ కేంద్రం సిగ్మా అంతర్జాతీయ తయారీ వ్యవస్థలో కీలకంగా మారుతుంది. సంస్థ ఈ కేంద్రం ద్వారా రెండంకెల ఎబిటా (ఇ.బి.ఐ.టి.ఎ.) వృద్ధిని ఆశిస్తోంది’’ అని తెలిపారు.


