ఎల్సీడీసీ సర్వేను పరిశీలించిన ప్యాపిలి వైద్యాధికారి
1 min read
– డాక్టర్ రాహుల్
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి వైద్యాధికారి డాక్టర్ రాహుల్ ప్యాపిలి పట్టణంలోని 3, 4వ సచివాలయాలను సందర్శించి ఎల్సీడీసీ (లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్) సర్వేను పరిశీలించారు. శరీరంపై స్పర్శలేని రాగి రంగు మచ్చలు, బొడిపెలు, తిమ్మిర్లు తదితర లక్షణాలు ఉంటే అనుమానిత కుష్ఠు వ్యాధి కేసుగా గుర్తించి ఆసుపత్రికి రెఫర్ చేయాలని సిబ్బందికి సూచించారు.కుష్ఠు వ్యాధి నిర్ధారణ అయిన వారు మల్టీ డ్రగ్ థెరపీ మందులతో చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అవుతుందని, ఈ మందులు ఉచితంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను అడిగి వివరాలను నమోదు చేయాలని, ఇంట్లో ఎవరూ లేకపోతే మళ్లీ ఆ ఇంటిని సందర్శించాలని సూచించారు. ఈ నెల 24వ తేదీ వరకు 15 రోజుల పాటు సర్వే నిర్వహించాలని ఆదేశించారు.అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒక కేసును డీఈఐసీ, నంద్యాలకు రెఫర్ చేశారు.ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా ఆరోగ్య విద్యా బోధకుడు రాఘవేంద్ర గౌడ్ మాట్లాడుతూ జీవితం ఎంతో విలువైనదని, ప్రతి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. నిరాశ, నిస్పృహలకు గురికాకుండా, అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులు బాధితులను ఒంటరిగా వదలకుండా వారితో మాట్లాడుతుండాలని తెలిపారు. మానసిక వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. టోల్ఫ్రీ నంబర్ 14416కు కాల్ చేస్తే మానసిక వైద్యులు సమస్యలకు పరిష్కారం చూపుతారని తెలిపారు.కార్యక్రమంలో పర్యవేక్షకులు మనోహర్ రెడ్డి, ఎంఎల్హెచ్పీ మల్లేశ్వరి, ఏఎన్ఎం శోభ, అరుణ్ భాయ్, ఆశా కార్యకర్తలు, మేల్ వాలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు.



