అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇంటి స్థలం, టిడ్కో ఇల్లు అందేలా చర్యలు
1 min read
ఆన్లైన్లో వచ్చిన ఇంటి పట్టాల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి: మంత్రి ఎన్ఎండీ ఫరూక్
నంద్యాల, న్యూస్ నేడు : నంద్యాల నియోజకవర్గ పరిధిలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇంటి స్థలం, టిడ్కో ఇళ్ల కేటాయింపు జరిగేలా సమన్వయంతో చర్యలు చేపట్టాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నంద్యాలలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్లతో కలిసి నంద్యాల నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్ల కేటాయింపులపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, ఇంటి స్థలాలు, టిడ్కో ఇళ్ల కేటాయింపునకు సంబంధించి అర్హత కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రయోజనం అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల అర్హత నిర్ధారణ, తదుపరి కేటాయింపు ప్రక్రియను నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో హౌసింగ్ ఈఈ, టిడ్కో ఈఈ, నంద్యాల మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, నంద్యాల, నంద్యాల రూరల్, గోస్పాడు తహసీల్దార్లు, హౌసింగ్ ఏఈలు తదితర అధికారులు పాల్గొన్నారు.


