మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని మరణం తీరనిలోటు
1 min read
జిల్లా టి డి పి పార్టీ అధ్యక్షులు,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆవేదన
పార్ధివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కుటుంబానికి ధైర్యం చెప్పారు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు నియోజకవర్గ ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని మరణం తీరని లోటని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లేరన్న నిజాన్ని ఇప్పటికీ నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. తాను కూడా ఈ వార్త తెలిసిన వెంటనే షాక్కు గురయ్యానని ఎమ్మెల్యే చంటి చెప్పారు. ఏలూరు శ్రీరామ్ నగర్లోని ఏపి మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ నాని స్వగృహానికి చేరుకున్న ఎమ్మెల్యే బడేటి చంటి ఆయన పార్ధివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ అతి పిన్న వయసులోనే ఏలూరు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆళ్ళ నానితో తనకున్న స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. రాజకీయ సిద్ధాంతాలు వేరైనప్పటికీ ఆత్మీయతతో ఉండే మృదుస్వభావి ఆళ్ళ నాని అని ఎమ్మెల్యే కొనియాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చురుకైన పాత్ర పోషిస్తారనుకుంటున్న తరుణంలో ఈ విధంగా ఆయన దూరమై ఆళ్ళ నాని సేవలు పొందలేకపోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఇటువంటి కష్టకాలంలో భగవంతుడు ఆయన కుటుంబ సభ్యులకు మరింత ధైర్యాన్నివ్వాలని బడేటి చంటి పేర్కొన్నారు. కాగా మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో గురువారం ఏలూరులో జరుగుతాయని ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. రాష్ట్ర సమాచార శాఖామంత్రి కొలుసు పార్థసారధి ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పారు.



