రాజకీయాల్లో హుందాతనానికి ప్రతీక ఆళ్ల నాని
1 min read
ఆళ్ల నాని కుటుంబానికి పార్టీ పరంగా,వ్యక్తి గతంగా అండగా ఉంటాం
ఆళ్ల నాని పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన రాష్ట్ర ఐటి,విద్యా శాఖ మంత్రి నారా లోకేష్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ ఒక మంచి వ్యక్తిని కోల్పోయిందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఉపముఖ్యమంత్రి, టీడీపీ నేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) పార్థివదేహానికి మంత్రి నారా లోకేష్ ఘన నివాళులర్పించారు. గురువారం ఏలూరులోని ఆళ్ల నాని నివాసానికి చేరుకున్న లోకేష్, ఆళ్ల నాని పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ “ఆళ్ల నాని మృతి బాధాకరం. ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది. నాని అన్న మంత్రిగా ఉన్న సమయంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. సభలో అనేక అంశాలపై ఆయనతో చర్చించేవాడిని. అయితే ఏనాడూ వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా హుందాతనంగా ఆయన వ్యవహరించేవారు” అని లోకేష్ తెలిపారు.రాజకీయాల్లో రాజనీతి ఉండాలని బలంగా నమ్మిన వ్యక్తి ఆళ్ల నాని అన్న. వ్యక్తిగత దూషణలకు ఆయన ఎప్పుడూ దూరంగా ఉండేవారు, ప్రజలు మనకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల సమస్యల గురించి మాట్లాడేందుకే ఉపయోగించాలనే భావనతో ఆయన ఉండేవారని చెప్పారు.ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఆళ్ల నాని సమాజానికి చేసిన సేవలు చరస్మరణీయం. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకోవాలి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి ప్రజలకు సేవ చేయాలని, నమ్ముకున్న నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి నాని అన్న” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, డా.నిమ్మల రామానాయుడు, ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్, ఏపి ఉపసభాపతి, ఉండి నియోజవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్,జిల్లా ఇంచార్జి కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, పత్సమట్ల ధర్మరాజు, ఏపి అప్కాభ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏపి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఏపీఎస్ఆర్టీసీ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, ఏపీ భవన నిర్మాణ, ఇతర నిర్మాణాలు కార్పొరేషన్ చైర్మన్ వలవల బాబ్జీ, మాజీ ఏలూరు నగరపాలక సంస్థ మేయరు షేక్ నూర్జహాన్, ఏపీ ఎన్జీవోస్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్, వివిధ శాఖలు అధికారులు, ఉద్యోగులు,ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, ప్రజలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.



