విలువిద్య…భారత దేశపు సాంప్రదాయ క్రీడ
1 min read
రాజ్యసభ మాజీ సభ్యులు టిజి వేంకటేష్
- రిడ్జ్ పాఠశాలలో సౌత్ జోన్ -1 సీబీఎస్ఈ ఆర్చరీ పోటీలు ప్రారంభం
- 650 పాఠశాలలు నుంచి 2వేలమంది విద్యార్థులు బరిలో..
కర్నూలు స్పోర్ట్స్ , న్యూస్ నేడు: భారత దేశపు సాంప్రదాయ క్రీడ … విలువిద్య అని… ఆర్చరీ క్రీడకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యమిస్తున్నాయని రాజ్య సభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్ అన్నారు. ఆదివారం కర్నూలు నగర శివారులోని రిడ్జ్ స్కూల్ వేదికగా సౌత్ ఇండియా సీబీఎస్ఈ జోనల్ ఆర్చరీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 650 పాఠశాలల నుంచి 2,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజ్యసభ మాజీ సభ్యులు, పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్, ఎన్సీసీ గర్ల్స్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కర్నల్ జోబి ఫిలిప్, రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు జి. పుల్లయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం అతిథులు క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఏకాగ్రత, పట్టుదల వంటి లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. విలువిద్య భారతదేశపు ప్రాచీన క్రీడా సంప్రదాయాల్లో ఒకటని ఆయన పేర్కొన్నారు. అనంతరం రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు జి. పుల్లయ్య మాట్లాడుతూ సి బి ఎస్ సి సౌత్ ఇండియా జోన్ వన్ స్థాయి ఆర్చరీ పోటీలను నిర్వహించే అవకాశం రిడ్జ్ స్కూల్ కు రావడం ఎంతో సంతోషం అన్నారు. ఆ తరువాత రవీంద్ర విద్యా సంస్థల చైర్మన్ జివిఎం. మోహన్ కుమార్ మాట్లాడుతూ గతంలో కర్నూల్ నగరంలో వాలీబాల్, ఫుట్బాల్,హాకీ వంటి క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేదని ప్రస్తుతం ఆర్చరీ వంటి ప్రత్యేక క్రీడలకు కూడా కర్నూలు నగరం వేదికగా మారడం సంతోషకరమన్నారు. ఇలాంటి జాతీయస్థాయి పోటీల నిర్వహణ ద్వారా కర్నూల్ క్రీడా నగరంగా మరింత గుర్తింపు పొందే అవకాశం ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో రిడ్జ్ స్కూల్ సీఈవో జి. గోపీనాథ్, కో సీఈవో సౌమ్య గోపీనాథ్, రవీంద్ర విద్యా సంస్థల వైస్ చైర్మన్ జి.వంశీధర్, స్కూల్ డీన్ రాజేంద్రన్, ప్రిన్సిపల్ రాజ్ కమల్, ఉపాధ్యాయులు, సీబీఎస్ఈ అధికారులు, కోచులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు,తదితరులు పాల్గొన్నారు.



