కర్ణాటక ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సమ్మిట్ను విజయవంతం చేద్దాం
1 min read
గ్లోబల్ యాక్సిలరేటర్ విజన్ సమ్మిట్ ప్రచారం ప్రారంభం
- .కార్యక్రమంలో పాల్గొన్న కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, ఏపీ మంత్రి టీ.జీ. భరత్
బెంగళూరు: కర్ణాటక ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో డిసెంబర్ 25, 26, 27 తేదీల్లో బెంగళూరులో నిర్వహించనున్న గ్లోబల్ యాక్సిలరేటర్ విజన్ సమ్మిట్ కు సంబంధించిన ప్రమోషనల్ క్యాంపెయిన్ను బెంగళూరులోని గాంధీనగర్ ఫ్రీడమ్ పార్క్లో కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ.జీ. భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి టీ.జీ. భరత్ మాట్లాడుతూ ఈ సమ్మిట్ ప్రచారం ప్రారంభ కార్యక్రమానికి సీఎం డి.కె శివకుమార్ రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గ్లోబల్ యాక్సిలరేటర్ విజన్ సమ్మిట్ వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచన కర్ణాటక ఆర్యవైశ్య మహాసభకు రావడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఒకే వేదికపై సమావేశమై తమ ఆలోచనలు, అనుభవాలను పంచుకునేందుకు ఈ సమ్మిట్ గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు. ఈ సమ్మిట్ ద్వారా స్థానికంగా కొత్త కంపెనీలు, వ్యాపార సంస్థలు ఏర్పడటంతో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు సృష్టించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. గ్లోబల్ యాక్సిలరేటర్ విజన్ సమ్మిట్ కేవలం ఆర్యవైశ్యులకు మాత్రమే పరిమితమైన కార్యక్రమం కాదని, సమాజంలోని అన్ని వర్గాల పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, యువతకు ఉపయోగపడే విధంగా దీనిని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.
సమ్మిట్ నిర్వహణకు ఛైర్మన్గా పదవి ఇచ్చినందున బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని టీ.జీ. భరత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కూడా అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సమ్మిట్కు ముఖ్య అతిథులుగా పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారని వెల్లడించారు. గ్లోబల్ యాక్సిలరేటర్ విజన్ సమ్మిట్పై అవగాహన కల్పించేందుకు త్వరలో వివిధ ప్రాంతాల్లో రోడ్షోలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, యువ వ్యాపారవేత్తలు, స్టార్టప్ సంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమ్మిట్లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ప్రపంచ స్థాయి వ్యాపార అవకాశాలు, పెట్టుబడులు, ఆవిష్కరణలు, పారిశ్రామిక భాగస్వామ్యాలకు వేదికగా గ్లోబల్ యాక్సిలరేటర్ విజన్ సమ్మిట్ను విజయవంతం చేయడానికి అన్ని వర్గాల సహకారం అవసరమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ఎమ్మెల్సీ డి.యస్ అరుణ్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే రాజగోపాల్ శ్రీరామ్ తాతయ్య, కర్ణాటక ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఆర్.పి రవి శంకర్, మాజీ ఎమ్మెల్యే హెచ్.పి. మంజునాథ్, బయో ఫ్యూయల్ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ సుధీంద్ర, కర్ణాటక ఆర్యవైశ్య డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ రాంప్రసాద్, తెలంగాణ ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కాల్వ సుజాత గుప్త, కర్ణాటక ఆర్యవైశ్య చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ సి.ఏ. ఐ.ఎస్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసవీ సేవాదల్ ప్రెసిడెంట్ దూపకుంట్ల శబరి వర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.



