ఏలూరు 2వ డివిజన్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా
1 min read
డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్ళ మధ్యలో మురుగునీరు నిల్వ
సిపిఐ ఏలూరు ఏరియ సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్
కార్పొరేషన్ మేనేజర్ సిహెచ్ వివిఎన్ మూర్తికి వినతి పత్రం అందజేత
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఏలూరు ఏరియా సమితి మరియు 2వ డివిజన్ ఆధ్వర్యంలో 2వ డివిజన్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ ఏలూరు కార్పొరేషన్ 2వ డివిజన్, బృందావన్ గార్డెన్స్ పరిసర ప్రాంతాలలో మురుగునీరు పారుదలకు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వలన వాడకపు మురుగునీరంతా ఇళ్ల పక్కనే నిలబడి, దోమలు విపరీతంగా పెరిగిపోయి అనేక అనారోగ్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వెంకటాపురం పంచాయతీ నుండి ఏలూరు నగరంలోకి విలీనమైన తరువాత కూడా ఈ ప్రాంతంలో కనీసం మురుగునీరు పారుదలకు డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇక్కడ స్థానికంగా నివసిస్తున్న ప్రజలందరూ అనారోగ్యాలపాలై అనేక ఇబ్బందులు పడుతున్నారని,నివాస ప్రదేశాల నుండి ప్రధాన రహదారికి వచ్చుటకు సరైన రోడ్డు లేకపోవటం వలన కనీసం నడిచి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడవలసి వస్తున్నదనీ, వీధి దీపాలను ఏర్పాటు చేయకపోవడం వల్ల పాములు,విష కీటకాల బారిన పడి ప్రమాదాలకు గురికావాల్సి వస్తుందని ముఖ్యంగా రాత్రి సమయంలో ఆ మార్గంలో వెళ్లి వచ్చుటకు భయాందోళనలకు గురికావాల్సి వస్తుందనీ ఆందోళన వ్యక్తం చేశారు. కనీస మౌలిక వసతులైన రోడ్లు, డ్రైనేజీ,వీధి దీపాలు లేకపోవడం,తాగునీటికి మునిసిపల్ నీరు కోసం కిలోమీటర్ పైగా నడచి వెళ్ళి తెచ్చుకోవడం వల్ల ఇక్కడ నివసించే ప్రజలందరూ పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏరియా సహాయ కార్యదర్శి అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా మాట్లాడుతూ రెండో డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కార్పొరేషన్ అధికారులు కమిషనర్ చర్యలు తీసుకుని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.అనంతరం కార్పొరేషన్ మేనేజర్ సిహెచ్ వి వి ఎన్ మూర్తి కి వినతిపత్రం అందించారు.ఈ కార్యక్రమంలో ఏలూరు ఏరియా సమితి సభ్యులు మావూరి విజయ,శాయన అభిలాష్ కుమార్,గొర్లి స్వాతి, కొండేటి రాంబాబు,మేరీ,దేశం శెట్టి అమ్మాజీ,2వ డివిజన్ కార్యదర్శి లక్కోజు జగదీశ్వరి,1వ డివిజన్ కార్యదర్శి వెదురుపర్తి శారదా,లక్కోజు లక్ష్మి, దొడ్డి దుర్గ, రమణమ్మ, నాగలక్ష్మి,శివాని,భవాని, ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.
