రసాయన ఎరువులు అధికంగా వాడవద్దు..
1 min read
పాడి పంటలు మరింత మెరుగుపడాలి..
డ్రోన్స్ సాంకేతికతను వినియోగించుకోండి.
కలెక్టర్ రాజకుమారి గణియా..
మహానంది, న్యూస్ నేడు: రసాయన ఎరువులు అధికంగా వాడవద్దని, పాడి పంటలు మరింత మెరుగుపడాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు. గురువారం మహానంది మండలం బుక్కాపురం గ్రామంలోని రామాలయం నందు వికసిత కృషి సంకల్ప అభినయ్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు శాస్త్రీయ సలహాలు పాటించి పెట్టుబడి ఖర్చు తగ్గించుకొని, వ్యవసాయం లాభసాటిగా మార్చుకోవాలని సూచించారు.రసాయన ఎరువులు వాడడం వల్ల భాస్వరం భూమి లోపలి పొరల్లో నిల్వ ఉండి నేల గట్టిగా మారి పంటలకు నష్టం కలిగిస్తుందన్నారు.ప్రతి మొక్కకు నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అవసరం అన్నారు.రైతులు అవగాహన లోపంతో కొన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల్లో ఉందని పోషకాలను అదనంగా చేర్చి వాడాల్సిన విషయం తెలియదన్నారు. వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తూ, సకాలంలో పంటకు అవసరమైన రసాయనాలు అందజేయడానికి డ్రోన్స్ ఎంతో గాను ఉపయోగపడతాయని వాటిని రైతులు వ్యవసాయానికి వినియోగించుకోవాలన్నారు. నంద్యాల జిల్లాలో ఇప్పటివరకు 40 గ్రూపుల రైతులకు డ్రోన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. రైతు ఒక ఎకరా పిచికారీ చేయడానికి 3 నుంచి 4 గంటల సమయం పడితే డ్రోన్స్ ద్వారా ఒక ఎకరాకి కేవలం పది నిమిషాల్లో పిచికారీ పూర్తి చేసే అవకాశం ఉంటుందన్నారు. డ్రోన్స్ కొనుగోలుకు బ్యాంకుల ద్వారా 80 శాతం వరకు రుణాలు అందజేస్తోందన్నారు. డ్రోన్స్ కొనుగోలు చేసిన గ్రూపుకు అవసరమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.మహానంది మండలంలో రైతు తలసరి ఆదాయం మూడు లక్షల అరవై వేల వరకు ఉందని, ఆ దిశగా అన్ని మండలాలు అభివృద్ధి చెందాలన్నారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవెత్త, డాక్టర్ సూగన్న,కేవీకే ప్రధాన శాస్త్రవెత్త డాక్టర్. జి. ధనలక్ష్మి, రమణయ్య లు మాట్లాడుతూ.. ఖరీఫ్ ముందు చేపట్టాల్సిన సన్నద్దత కార్యక్రమాలు, భూసారా ఆధారిత ఎరువుల యాజమాన్యం, ప్రస్తుతం పంటల్లో వేయాల్సిన ఎరువుల మొతాదును వివరించారు. మొక్కజొన్న, కంది, వరి, సోయబీన్, పంటల్లో సస్యరక్షణ చర్యలైన విత్తన శుద్ధి, తెగుళ్ళు, పురుగు మందుల యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు.అలాగే వ్యవసాయ శాఖ అందిస్తున్న ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ఉద్యాన పంటల్లో అధిక దిగుబడులు పొందాలంటే మేలైన రకాల ఎంపిక అవసరం అన్నారు. ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మురళి కృష్ణ, జిల్లా ఉద్యాన అధికారి నాగరాజు, ఐ సి ఏ ఆర్ శాస్త్రవెత్త డా. సూగన్న, కేవీకే శాస్త్రవెత్త రమణయ్య, , పీ డి ఆత్మ రత్నకుమార్, నంద్యాల ఏ డి ఏ రాజశేఖర్, మండల వ్యవసాయ అధికారి నాగేశ్వర్ రెడ్డి, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
