కర్నూలు-విజయవాడ మధ్య జులై 2 నుండి విమాన సర్వీసు ప్రారంభం..
1 min read
రాష్ట్ర మంత్రి టి.జి భరత్
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నుండి విజయవాడకు జులై 2వ తేదీ నుండి విమాన సౌకర్యం ప్రారంభమవుతుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు. ప్రస్తుతానికి సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో ఈ సర్వీసు నడుస్తుందన్నారు. త్వరలో ప్రతి రోజూ ఈ విమాన సర్వీసు నడుపుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పినట్లు మంత్రి టి.జి భరత్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కర్నూలు నుండి విజయవాడకు విమాన సర్వీసు అందుబాటులోకి రావడం శుభపరిణామం అన్నారు. ఓర్వకల్లు పారిశ్రామికాభివృద్ధిలో విమాన సర్వీసు ఎంతో కీలకమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును పలుమార్లు కలిసి ఈ విషయంపై చర్చించినట్లు ఆయన గుర్తుచేశారు. అడిగిన వెంటనే దీనిపై స్పందించి విమాన సర్వీసు అందుబాటులోకి తీసుకువచ్చిన కేంద్ర మంత్రికి కర్నూలు జిల్లా ప్రజల తరుపున మంత్రి టి.జి భరత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.