జీజీహెచ్ కు రెండవ గేట్ ఓపెన్…
1 min read
ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకే..
- ఆస్పత్రిలో పార్కింగ్ స్థలాలు గుర్తింపు..
- రోగికి ఐడీ కార్డు.. వ్యాధి వివరాలు నిక్షిప్తం..
- రోగులు.. ప్రజలు సహకరించాలి…
- జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు
కర్నూలు (హాస్పిటల్), న్యూస్ నేడు :ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చే రోగులు.. ఎటువంటి ఇబ్బంది పడరాదన్న సదుద్దేశంతో ఆస్పత్రి రెండవ గేట్ ను ఓపెన్ చేస్తున్నామని, దీంతో కొంత ట్రాఫిక్ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని జీజీహెచ్ సూపరింటెడెంట్ డా. వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. రోగులకు వేగంగా… మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో సోమవారం నుంచి ఆస్పత్రి రెండవ గేట్ ( ఇన్) ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శనివారం తన ఛాంబరులో సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఆస్పత్రిలో పార్కింగ్ స్థలాలు లేక కొన్నేళ్లుగా రోగులు…వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని, ఇక నుంచి పార్కింగ్ సమస్య తలెత్త కూడదని పార్కింగ్ స్థలాలను కూడా గుర్తించామని, వాటిని అభివృద్ధి చేసిన తరువాత అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.
రోగికి ఐడీ కార్డు…
వివిధ వ్యాధుల నిమిత్తం వచ్చే రోగులకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ (ఐడీ ) కార్డు రూపొందిస్తామని, అందుకు వారి ఫోన్ నెంబరు లింక్ ఉన్న ఆధార్ కార్డును తీసుకురావాలని ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు మీడియా ద్వారా ప్రజలను కోరారు. రోగికి వచ్చిన వ్యాధి.. చికిత్స వివరాలు.. రక్త, యూరిన్ పరీక్షలు తదితర అంశాలను ఆన్లైన్లో పొందుపరిచి…ఐడీ కార్డు ఇస్తామని, దీంతో సదరు రోగి ఏ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లినా ఐడీ కార్డు నెంబరును కంప్యూటర్లో పరిశీలిస్తే వివరాలు ఉంటాయని తెలిపారు.
ఐడీ కార్డు… పీహెచ్సీలో..
కర్నూలు జిల్లాలోని ప్రతి ఒక్కరూ తమ ఫోన్ నెంబరు లింక్ ఉన్న ఆధార్ నెంబరుతో ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఐడీ కార్డు తయారు చేస్తారని చెప్పిన సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు… ప్రతి పీహెచ్సీలో కూడా ఐడీ కార్డును రూపొందిస్తారని, అక్కడికి వెళ్లి కార్డు తయారు చేయించుకుంటే మేలని, ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడరాదని తెలిపారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు.