సామాజిక స్ఫూర్తితో సహాయార్థులకు సహాయం చేయడం అభినందనీయం
1 min read
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
విజయ చర్మవ్యాధుల ఆసుపత్రిలో 750వ ఉచిత వైద్య శిబిరం
చర్మవ్యాధుల శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ఆసుపత్రి అధినేత దశిక సుబ్బారావు కుటుంబ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : సామాజిక స్ఫూర్తితో అవసరార్ధులకు సహాయం అందించే విషయంలో వివిధ రంగాల ప్రముఖులు స్వచ్ఛంధంగా ముందుకు రావడం అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. దాతలు, ప్రముఖుల సేవా కార్యక్రమాలు ఎంతోమందికి స్పూర్తిదాయకంగా నిలుస్తాయని, దీని వల్ల మరింతమంది తమ ధాతృత్వాన్ని, సేవా గుణాన్ని చూపించుకునేందుకు ముందుకు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఏలూరు రామచంద్రరావుపేటలోని విజయ చర్మవ్యాధుల ఆస్పత్రి అధినేత డాక్టర్:దశిక సుబ్బారావు ఆధ్వర్యంలో ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన 750వ ఉచిత చర్మవ్యాధుల శిబిరాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా డాక్టర్ సుబ్బారావు ప్రతిఏటా క్రమం తప్పకుండా ఉచిత చర్మవ్యాధుల శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ వల్ల ఎంతోమంది రోగులకు ప్రయోజనం కలుగుతుందని, అంతేకాకుండా ఇటువంటి శిబిరాలు నిర్వహించాలన్న స్పూర్తి ఇతరులలో కూడా పెంపొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దాతలు, ప్రముఖులు నిర్వహించే సేవా కార్యక్రమాలు సమాజంలోని ఎంతోమందికి స్పూర్తిదాయకంగా నిలుస్తాయని, దానివల్ల మరింతమంది చైతన్యవంతులై ఇతరులకు సేవ చేసేందుకు ముందుకు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. డాక్టర్ దశిక సుబ్బారావు మాట్లాడుతు 36 సంవత్సరాల నుండి తాను వైద్యునిగా సేవలు అందిస్తున్నానని, ఇప్పటివరకు 750 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, 63 వేల మందికి వైద్య సేవలు అందించడంతో పాటు మందులు కూడా ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, పలువురు ప్రముఖులు, వైద్యులు డాక్టర్ జీవనలత, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ సుబ్బారావు సతీమణి సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
