జిల్లాలో విజయవంతంగా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం
1 min read
గత ఏడాది కోటి 20 లక్షల పని దినాల లక్ష్యానికి కోటి 20 లక్షల65 వేల పని దినాలు కల్పించి103 శాతం పైగా వృద్ధిని సాధించాం
జిల్లా డ్వామా పీడీ వెంకట సుబ్బారావు వెల్లడి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం విజయవంతంగా నిర్వహించబడుతుందని డ్వామా పిడి వెంకట సుబ్బారావు తెలిపారు. మంగళవారం స్ధానిక డ్వామా కార్యాలయంలో జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం అమలు తీరును ఆయన పాత్రికేయులకు వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గత ఏడాది కోటి 20 లక్షల పని దినాల లక్ష్యానికి కోటి 23 లక్షల 65 వేల పనిదినాలు కల్పించి 103 శాతం పైగా వృద్ధిని సాధించామన్నారు. గతంలో ఉపాధిహామి వేతనం సరాసరి రూ. 300 కాగా దానిని ప్రభుత్వం రూ. 307 కు పెంచిందన్నారు. ఈ మేరకు గత ఏడాది రూ. 300 వేతన సరాసరికి జిల్లాలో రూ. 253 కు సాదించామని మరి ఈ ఏడాది పెరిగిన సరాసరి వేతనానికి అనుగుణంగా కనీసం రూ. 290 తగ్గకుండా వేతనం కల్పించి ఉపాధిహామీపై మరింత నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టామన్నారు. ఉపాధిహామీ పనులకు సంబంధించి ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన పనులకు సంబంధించి ప్రస్తుతం రూ. 280 సరాసరి వేతనం చెల్లించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఉపాధిహామీ కార్మికులుగా పేర్కొనడం జరుగుతున్నదని అయితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇకపై ఉపాధిహామీ కార్మికులకు బదులు ఉపాధి శ్రామికులుగా పేర్కనడం జరుగుతుందన్నారు. వేసవి కాలంలో ఎక్కువ పనులు చేసేందుకు అవకాశం ఉన్నందున ఏప్రిల్, మే, జూన్, జనవరి, ఫిబ్రవరి, నెలల్లో పనులు ఎక్కువ చేపట్టడం జరిగేలా ప్రణాళిక చేశామన్నారు. ఉధ్యానపంటల విస్తరణకు సంబంధించి గత ఏడాది 3,150 ఎకరాలు లక్ష్యాంగా తీసుకోవడం జరిగిందని, అయితే జిల్లా ఇన్ చార్జి మంత్రి వర్యుల సూచన మేరకు 5 ఎకరాలు ఆలోపు చిన్నా, సన్నకారు రైతులకు సంబంధించి ఉధ్యాన పంటలకు ఉపాధిహామి అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. సుమారు 8 నుండి 10 వేల ఎకరాలను లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. దీనివల్ల రాష్ట్ర జిడిపి కూడా పెరిగేందుకు దోహదపడుతుందన్నారు. మండలాల్లో ప్రోగ్రాం ఆఫీసర్లు ఉపాధిహామీ పనుల నిర్వహణలో చురుగ్గా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ వారు ఆదేశాలుఇచ్చియున్నారన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు తప్పనిసరిగా మస్తర్లు తనిఖీ చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఉపాధిహామి పధకాన్ని మరింత పారదర్శకంగా నిర్వహించి ఎక్కువమంది శ్రామికులకు పని కల్పించి వారు ఆశించిన వేతనలు అందేలా కృషిచేస్తున్నామన్నారు.