జూలై 9న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె
1 min read
నగర కార్పొరేషన్ కమిషనర్ కు సమ్మె నోటీసు
ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బజంత్రీ శ్రీనివాసరావు
ఏలూరుజిల్లా ప్రతినిధి ఏలూరు న్యూస్ నేడు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)ఏలూరు జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు తెలిపారు.బుధవారం ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలోఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ కి సమ్మె నోటీసు అందజేశారు.ఈ సందర్భంగా భజంత్రీ శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ లకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీస్ చట్టం,షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాలకు సవరణలు తెచ్చి రోజుకు 8 గంటల పని స్థానంలో 10 గంటలు పని విధానాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. సరైన రక్షణ,సౌకర్యాలు కల్పించకుండా మహిళలకు రాత్రి సమయాలలో పనిచేయించేందుకు యాజమాన్యాలకు స్వేచ్ఛ ఇస్తూ శ్రామిక మహిళల హక్కులను కాలరాసేలా చట్టంలో సవరణలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.బిజెపి ప్రభుత్వ అడుగుజాడలలో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాలలో తెచ్చిన సవరణలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.మున్సిపల్ కార్మికులకుప్రభుత్వం తరఫున సంక్షేమపథకాలు అమలు చేయాలని,కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని,ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.ఏలూరు నగర కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ పారిశుధ్య పర్మినెంట్ కార్మికులకు యూనిఫారం,కుట్టుకూలీ,చెప్పులు,సబ్బులు, కొబ్బరినూనె, తక్షణం అందజేయాలని కోరారు.జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మె లో మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలోజిల్లా ఉపాధ్యక్షులు దొడ్డిగర్ల నాగబాబు,ఏలూరు నగర అధ్యక్షులు యలగాడ దుర్గారావు, నగర కార్యనిర్వాహక అధ్యక్షులు యలగాడ శివకుమార్,యూనియన్ సభ్యులు గోవాడ మల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.