సంక్షేమ వసతి గృహాలకు రూ. 12 కోట్లతో కొత్త భవనాలు
1 min read
రూ:5.72 కోట్లతో 52 సంక్షేమ వసతి గృహాల భవనాలకు మరమ్మత్తులు
56 వసతి గృహాలలో 448 సిసి కెమెరాలు
సాంఘిక సంక్షేమ జెడి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :ఏలూరు జిలాల్లో శిధిలావస్థలో ఉన్న 4 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను 12 కోట్ల రూపాయలతో నూతన భవనాలు నిర్మిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఇంచార్జ్ జాయింట్ డైరెక్టర్ ఎం. ముక్కంటి చెప్పారు. స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను పాత్రికేయుల సమావేశంలో ఆయన వివరించారు. ఈ సందర్భంగా ముక్కంటి మాట్లాడుతూ జిల్లాలోని కైకలూరు, పెదపాడు, గుండుగొలను, ముదినేపల్లి లలో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల స్థానంలో 12 కోట్ల రూపాయలతో కొత్త భవనాలు నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఏలూరు జిల్లాలో మొత్తం 59 ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయని, వాటిలో 53 ప్రభుత్వ భవనాలలో, 6 ప్రైవేట్ భవనాలలో నిర్వహిస్తున్నామన్నారు. మొత్తం 59 వసతి గృహాలలో 27 బాలుర వసతి గృహాలలో 1766 మంది విద్యార్థులు, 32 బాలికల వసతి గృహాలలో 2694 మంది విద్యార్థినిలు వసతి పొందుతున్నారన్నారు. వీరందరికీ 5130 దుప్పట్లు, కార్పెట్లు, టవల్స్, తదితర నిత్యం వినియోగించే వస్తువులు అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం నిర్వహించే భవనాలలో 52 భవనాల మరమ్మత్తు పనులకు రాష్ట్ర ప్రభుత్వం 5. 72 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, మరమ్మత్తు పనులను పంచాయతీరాజ్, రహదారులు,భవనాలు, సాంఘిక సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం, సర్వశిక్షా అభియాన్, పబ్లిక్ హెల్త్ శాఖలకు అప్పగించడం జరిగిందన్నారు. 90 శాతం మేర పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన 10 శాతం పనులు పురోగతిలో ఉన్నాయని, వసతి గృహాలలో ప్రవేశాలు ప్రారంభానికి ముందే జూన్, మొదటి వారం నాటికి భవనాల మరమ్మత్తులు పూర్తిఅయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ వసతి గృహాలలో విద్యార్థినీ, విద్యార్థులకు రక్షణపరంగా పలు చర్యలు తీసుకుంటున్నామని, 56 సంక్షేమ వసతి గృహాలలో 448 సిసి కెమెరాలు అమర్చామన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 6900 మంది విద్యార్థినీ, విద్యార్థులను సంక్షేమ వసతి గృహాలలో ప్రవేశాలు లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలోని సహాయ సాంఘిక సంక్షేమ శాఖాధికారులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించామన్నారు. సిబ్బంది ఇంటింటికి వెళ్లి విద్యకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, వసతి గృహాలలో సౌకర్యాలు గురించి తెలియజేస్తున్నామన్నారు. గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో విద్యనభ్యసించే వారిలో 10వ తరగతి లో 87 శాతం, ఇంటర్మీడియట్ లో 89 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ముక్కంటి తెలియజేసారు.