ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి
1 min read
రోగుల నుండి డబ్బు వసూలు చేస్తే చర్యలు తప్పవు
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు , న్యూస్ నేడు : డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని, రోగుల నుండి డబ్బు వసూలు చేస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆసుపత్రి యాజమాన్యాలను హెచ్చరించారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో జిల్లా కలెక్టర్ సమీక్ష్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు ఉచితంగా వైద్యం అందించే పథకమని, రోగుల నుండి డబ్బు తీసుకోవడం సముచితం కాదని హితవు పలికారు. ఆసుపత్రి యాజమాన్యాలు రోగుల నుండి డబ్బు తీసుకుంటున్నట్లు ఐ వి ఆర్ ఎస్ ద్వారా సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణలో తేలిందన్నారు.. నగరంలోని సంజీవిని హాస్పిటల్, సుఖీభవ హాస్పిటల్, కర్నూలు హార్ట్ అండ్ బ్రెయిన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగుల నుండి డబ్బులు తీసుకుంటున్నట్లు ప్రజల నుండి ఎక్కువ ఫిర్యాదులు అందాయన్నారు. ఈ హాస్పిటల్ లపై ఫిర్యాదులు నిజమా, కాదా అని ఎంక్వయిరీ చేయాలని, నిజమైతే వీటిని డీఎంపానెల్ మెంట్ చేయాలని కలెక్టర్ డి ఎం హెచ్ వో ను ఆదేశించారు. ప్రజల నుండి ఫిర్యాదులు రాకుండా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ ఆసుపత్రుల యాజమాన్యాలకు సూచించారు.. ఆయా ఆస్పత్రుల్లో రోగుల నుండి డబ్బు తీసుకుంటున్నారా అని రోగుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని కలెక్టర్ యాజమాన్యాలకు సూచించారు.ఎన్టీఆర్ వైద్య సేవ కింద మందులను బయట తీసుకోవాలని రాయకూడదని, ఉచితంగా ఆస్పత్రులే ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.. రోగి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఆరోగ్య పరిస్థితులను ఫాలోఅప్ చేయాలని, అలాగే ఫాలో అప్ మెడిసిన్స్ కూడా ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.ఆసుపత్రులపై వస్తున్న ఫిర్యాదులకు సంబంధించి డిఎంహెచ్ఓ, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ నెలలో ఒకసారి సమావేశం నిర్వహించుకొని ఫిర్యాదులపై వివరణ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.సమావేశంలో ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ డా.ఎంవిఎన్ఎస్వి.భాస్కర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డా.శాంతి కళ, ఇన్చార్జి జిజిహెచ్ సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఇంఛార్జి డిసిహెచ్ఎస్ డా.రామకృష్ణ, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు పాల్గొన్నారు.
