క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు
1 min read
క్షయ రహిత సమాజమే లక్ష్యం
ని-క్షయ్ సంపర్క్ హెల్ప్ లైన్: 1800-11-6666(టోల్ ఫ్రీ)
క్షయ వ్యాధి నిర్మూలన పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : క్షయ రహిత సమాజం అందరి లక్ష్యం కావాలని, ఇందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ లో ఇంటెన్సిఫైడ్ టి.బి. ముక్త్ భారత్ ప్రచార కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధి నిర్మూలన అవగాహన పోస్టర్లను, కరపత్రాలను కలెక్టర్ వెట్రిసెల్వి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయన్నారు. క్షయ పోషణ అభియాన్ కింద క్షయ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేస్తారని తెలిపారు. లక్షణాలు ఉన్నవారు సమీప ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించుకొని మందులు వాడాలని సూచించారు. ప్రధాన మంత్రి టి.బి. ముక్త్ భారత అభియాన్ ప్రోగ్రాం కింద ఎవరైనా సరే క్షయ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకొని నిక్షయ్ మిత్రగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఇందుకోసం ని-క్షయ్ సంపర్క్ హెల్ప్ లైన్ 1800-11-6666 టోల్ ఫ్రీని సంప్రదించవచ్చన్నారు. టి.బి. ని చికిత్స ద్వారానే కాకుండా నివారణ ద్వారా కూడా ఓడించాలన్నారు. నివారణతో సాధ్యమైనపుడు టి.బి. వ్యాధిని ఎందుకు విస్మరించాలన్నారు. ఈ వ్యాధిపై ఉన్న అపోహలు తొలగించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తిగా నయం చేయదగిన వ్యాధి అని ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ప్రస్తుత పరిస్ధితిలో ఈ వ్యాధి నిర్ధారణ మరింత సుళువుగా మారిందన్నారు. దీనిని వినియోగించుకొని ప్రతికేసును గుర్తించడం ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించగలమన్నారు. దగ్గుమాత్రమే టి.బి. వ్యాధి లక్షణం కాదని, శారీరక ఆరోగ్యంలో ఆకస్మిక మార్పు తెమడతో కూడిన దగ్గు, తెమడలో రక్తం పడటం, జ్వరం, ఛాతిలో నొప్పి, అలసట, నిరసం, ఏదైనా శరీరభాగంలో గుళ్లలు, వాపు రావడం వంటి లక్షణాల కనిపించినట్లయితే సమీప ఆరోగ్యకార్యకర్తను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డా. ఆర్. మాలిని, డిఐఓ డా. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.