PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా సేవే ధ్యేయంగా పనిచేస్తున్నా..: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

1 min read

నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం…

–ఊపిరి ఉన్నంతవరకు ప్రజలకు సేవ చేస్తానే తప్పా.. నేనెప్పుడు తప్పు చేయను..

  • అనుచరులైనంత మాత్రానా వారి వ్యక్తిగత విషయాలతో సంబంధం ఉండదు…
  • రాయచోటిలో ప్రభుత్వ భూముల కేటాయింపులపై అందరికీ అందుబాటులో బుక్ లెట్
  • 938 రిజిస్ట్రేషన్లు బయట ప్రాంతాలలో జరిగాయి.. వాటిపై అధికారులే వివరణలు ఇవ్వాలి
  • ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్​, అన్నమయ్యజిల్లా రాయచోటి: ప్రజా సేవే ధ్యేయంగా తాను  ఎప్పుడు పని చేస్తానని, ప్రజల వద్ద తలదించుకునే పనిని తానెప్పుడూ చేయనని రాయచోటి అన్నమయ్య జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఉద్ఘటించారు.మంగళవారం రాయచోటి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రవిశంకర్ రెడ్డి, సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి లతో కలసి శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశంలో  భూ ఆక్రమణలు అవినీతి ఆరోపణలపై  స్పందించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలలో   బాధ్యత, కర్తవ్యంగా భావించి ఏ విష్యంలోనైనా  పనిచేయాలన్నారు. అలా చేయడంలో చిన్న తేడా వచ్చిన వాటిని సరైన దారిలో మార్చుకునేలా ప్రజా ప్రతినిధులుగా కృషిచేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు.రాయచోటి లాంటి ప్రాంతంలో రెవెన్యూ సమస్యలు తరచూ వస్తుంటాయన్నారు.ఈ క్రమంలోనే  భూ కబ్జాలు, భూ దందాలు, అక్రమ రిజిస్ట్రేషన్లుపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నా యన్నాని చెప్పారు.ఇలాంటి  సందర్భాలలో బాధ్యతగల పదవులలో ఉన్నవారిపై కూడా ఆరోపణలు వస్తుంటాయన్నారు.ఆ సమయాలలో  ఆవేశాలకుతావివ్వకుండా ,హుందాతనంగా వ్యవహరించాలన్నదే నా వ్యక్తిగత అభిప్రాయమన్నారు. రెవెన్యూ సమస్యలను ఛాలెంజ్ గా తీసుకుని  శాశ్విత పరిష్కార మార్గం చూపాలన్నదే  నా లక్ష్యమన్నారు.ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ స్థలం కబ్జా కు గురైందన్న విషయం పత్రికల ద్వారా  తెలిసినప్పుడు  బాధ్యతగల వ్యక్తిగా సమాధానాలు చెపుతున్నామన్నారు.అంతేతప్ప  తప్పుఒప్పులను ఎత్తిచూపిన వారిపై ఎదురుదాడి, విమర్శలును ఏ ఒక్కరూ  చేయకూడదన్నారు.అందరి కృషి, కష్టం, దేవుడి దయతో రాయచోటిని జిల్లా కేంద్రంగా చేసుకున్నామన్నారు. దీంతో చుట్టుప్రక్కల ప్రాంతాలలోని భూముల విలువ బాగా పెరిగిందన్నారు.ఒక ప్రజా ప్రతినిధిగా రాయచోటి జిల్లా కాకమునుపు ,పది సంవత్సరాల నుంచి  తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులుతో చర్చిస్తూ  ప్రభుత్వ భూములను కాపాడాలని, అన్యాయాలను అరికట్టాలని ,తద్వారా  సామాన్యుడికి న్యాయం జరగాలన్న అంశాలుపై గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. పట్టణ పరిధిలో   22ఏ, డి కె టి,ప్రభుత్వ భూముల వివరాలను రెండేళ్ల క్రితమే అధికారులను  ఆడిగామన్నారు.  వాటికి సంబందించిన రికార్డులను తయారు చేసి  పారదర్శకంగా బహిర్గతం చేయాలని కూడా అధికారులుకు సూచించామన్నారు. పెండింగ్ రిజిస్ట్రేషన్ అక్రమాలను తొలుత ప్రచురించిన ఆంధ్రప్రభ విలేఖరి కృష్ణయ్య, మిగతా పత్రికా విలేఖరులను శ్రీకాంత్ రెడ్డి అభినందించారు. పేపర్ లో అక్రమ రిజిస్ట్రేషన్ వార్త చదివిన వెంటనే తహశీల్దార్ కు ఫోన్ చేశానని,అది క్రిమినల్ కేసు అవుతుందని   వివరించారన్నారు. అక్రమ పెండింగ్ రిజిస్ట్రేషన్ లో  ఎంఎల్ఏ హస్తం ఉందని,వారి అనుచరులు ఉన్నారంటూ కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.

అనుచరుల.. వ్యక్తిగత విషయాలకు సంబంధం ఉండదు…

అనుచరులు అయినంతమాత్రాన వ్యక్తిగత విషయాలకు సంబంధం ఉండదని శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కలెక్టరేట్ కు కేటాయించిన భూమి రిజిస్ట్రేషన్ విషయంలో జరిగింది తప్పేనన్నారు. గజేంద్ర రెడ్డి తమ పార్టీ వ్యక్తేనని, హరినాథరెడ్డి ఇటీవలనే పార్టీలోకి వచ్చారని ,వీళ్ళుతమ  పార్టీ వారేనని, కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాలకు నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు.ఈ రిజిస్ట్రేషన్ తో కూడా తనకు ఎలాంటి సంబంధం లేదని మరోమారు స్పష్టం చేశారు.

రెవెన్యూ రికార్డులు పారదర్శకంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష…

రాయచోటిలో జరిగిన ప్రభుత్వ భూముల కేటాయింపులపై అందరికీ అందుబాటులో బుక్ లెట్తాను ఎంఎల్ఏ గా  అయినప్పటి ప్రభుత్వ భూముల వివరాలను పారదర్శకంగా బుక్ లెట్  లో రూపొందించామని  శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.ఆ బుక్ లెట్ లోని వివరాలను విలేఖరులకు శ్రీకాంత్ రెడ్డి వివరించారు.

లిస్ట్1.అసైన్ మెంట్ కమిటీ, ఇప్పటివరకు క్రమబద్దీకరణ అయిన చుక్కల భూముల వివరాలు,నిషేధిత జాబితా భూముల  నుంచి తొలగించబడిన భూముల వివరాలు,

లిస్ట్2. ఎక్స్ సర్వీస్ మెన్ అసైన్ మెంట్ కాబడి  క్రమబద్దీకరణ జరిగిన భూముల వివరాలు,

లిస్ట్3.వివిధ ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన భూముల వివరాలు,

లిస్ట్4. ఇటీవల ఆక్రమణలు తొలగించిన భూముల వివరాలు,

లిస్ట్5.చుక్కల భూముల వివరాలు,

లిస్ట్6 ప్రభుత్వ భూముల వివరాలు,

లిస్ట్: 7 డి కె టి భూముల వివరాలు

ఈ బుక్ లెట్ ను పారదర్శకంగా తహశీల్దార్ కార్యాలయంలో ఉంచడం జరిగిందని, బుక్ లెట్ కావాల్సిన వారు ఇక్కడ ఉచితంగా పొందవచ్చు నన్నారు.

938 రిజిస్ట్రేషన్లు బయట ప్రాంతాలలో జరిగాయి.

2014 లో వచ్చిన చట్టం వల్ల రిజిస్ట్రేషన్లను ఎక్కడైనా చేసుకోవచ్చన్న  విధానంతో   రాయచోటి కి సంబందించిన భూ రిజిస్ట్రేషన్  వ్యవహారాలు రాయచోటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నందు కాకుండా ఇతర ప్రాంతాలలో ఇప్పటివరకు 938 రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు.ఇందులో 663 అప్రూవల్ అయ్యాయని, 275 రిజెక్ట్ అయ్యాయని అధికారులు చెప్పుచున్నారన్నారు.ఈ రిజిస్ట్రేషన్లు బోగస్ ఎన్ని , నిబంధనల మేరకు ఎన్ని ఉన్నాయన్న విషయాలు అధికారులు ధృవీకరించే విషయమన్నారు.స్థానికంగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉన్నప్పటికీ తిరుపతి,రేణిగుంట, కడప, సుండుపల్లె, లక్కిరెడ్డిపల్లె లలో ఎందుకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి వచ్చిందో, స్థానిక అధికారులు వాటిని ఎందుకు అంగీకరించారో వారే సమాధానం చెప్పాలన్నారు.

తప్పు చేయను.. ఒక వేళ చేస్తే.. రాజకీయాల నుంచి వైదొలుగుతా…

 తాను ఏనాడు రాజకీయాలులో తప్పుచేయనని, తప్పు చేసిన రోజే రాజకీయాల నుంచి శాశ్వితంగా వైదొలుగుతానని శ్రీకాంత్ రెడ్డి మరోమారు  స్పష్టం చేశారు.ఎటువంటి సంబంధం లేని ,తెలియని విషయాలలో , సాక్ష్యాధారాలు లేకుండానే  బురదజల్లే రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.ఈ ప్రాంతంలో అందరూ అనుభవం, విజ్ఞత ఉన్న నాయకులే ఉన్నారని చురకలంటించారు.ఇటీవల లక్కిరెడ్డిపల్లెలో జరిగిన  ఎస్ సి ల భూ వ్యవహారంలో మాజీ ఎంఎల్ఏ పైన కూడా  తాను వ్యక్తిగత ఆరోపణలు చేయలేదన్నారు. పూర్తిస్థాయిలో విచారించి తప్పుచేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరామన్నారు.. తనకు వ్యక్తిగత దూషణలు చేసే అలవాటు లేదని ,హుందాగా రాజకీయాలు చేస్తామన్నారు.

ప్రజా సేవే ధ్యేయంగా పనిచేస్తున్నా…

పట్టణంలోని ప్రభుత్వ భూములలో నగరవనానికి 76 ఎకరాలు,స్టేడియం నిర్మాణాలకు 26 ఎకరాల భూములను అధికారులు కేటాయింపులు చేశారన్నారు.ఇటీవల ముఖ్యమంత్రి గారి కార్యదర్శి ధనంజయ రెడ్డి గారు జిల్లా కలెక్టరేట్, ఎస్ పి కార్యాలయాలను సందర్శించినప్పుడు ఈ మాదిరిగా 13 జిల్లాలలో కార్యాలయాల భవనాలు లేవని ఈ సందర్భంగా ఆయన అభినందించారన్నారు. డి ఎస్ పి , ఆర్ డి ఓ, అన్ని జిల్లా కార్యాలయాలకు శాశ్విత భవనాలును నిర్మింపచేస్తా మన్నారు. ద్వేషాలకు తావివ్వవని, చేయి కాలు ఆడేంతవరకు  చిత్తశుద్ధి, నిజాయితీలుతో కష్టపడి ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన స్పష్టం చేసారు. తాను ప్రజలలో ఎంత సమయం గడుపుతున్నాను, కుటుంబంతో ఎంత సమయం గడుపుతున్నానో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. తన రాజకీయ జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిదని ,తానేమిటో నియోజక వర్గ ప్రజలకు తెలుసునన్నారు.   మేధావులు, విజ్ఞులు, అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరి సహాయ సహకరాలుతో , ప్రజలందరి సూచనలు,సలహాలతో నియోజక వర్గ అభివృద్ధితో పాటు  ప్రభుత్వ భూములను సంరక్షిస్తామని శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు,  మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్,మార్కెట్ కమిటీ  వైస్ చైర్మన్ తబ్రెజ్ ఖాన్, మదనపల్లె వైఎస్ఆర్ సిపి పరిశీలకులు హాబీబుల్లా ఖాన్, బేపారి మహమ్మద్ ఖాన్, జిల్లా వక్ఫ్ బోర్డ్ సభ్యులు జాకీర్ హుసేన్, నవరంగ్ నిస్సార్, ఆసీఫ్ అలీఖాన్, ఫయాజ్ అహమ్మద్, గౌస్ ఖాన్, సుగవాసి శ్యామ్,రియాజ్, సాదక్ అలీ,రౌనక్, అన్నా సలీం, భాస్కర్, జయన్న నాయక్, రియాజుర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

About Author