ప్రతి కుటుంబాన్ని పిఎం సూర్య ఘర్ పథకం క్రింద నమోదు చేయండి
1 min read
ఋణ మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు : జిల్లాలో ప్రతి కుటుంబాన్ని పిఎం సూర్య ఘర్ పథకం క్రింద నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి పీఎం సూర్య ఘర్ పథకం అమలుపై ఏపీఎస్పీడీసీఎల్ ఇంజనీర్లు, ఎనర్జీ అసిస్టెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ పథకం క్రింద నమోదు చేసుకున్న దరఖాస్తులలో 458 దరఖాస్తులు కన్వర్ట్ అయి సంబంధిత వెండర్ నుండి కమీషనింగ్ కు వెళ్లాయన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 97 వేల మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు సూర్యఘర్ సోలార్ ప్యానల్స్ కనెక్షన్ కోసం పేర్ల నమోదు చేసుకున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలు మినహా పిఎం సూర్య ఘర్ పథకం క్రింద దాదాపు 20 వేల మంది రిజిస్టర్ చేసుకోవడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ అయి కన్వర్ట్ కింద ఉన్న 1513 దరఖాస్తులను కమీషనింగ్ ఈనెలాఖరిలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులలో మరో 1513 దరఖాస్తులు కమీషనింగ్ కోసం వెండర్ కు రావాలని కలెక్టర్ ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులను కమీషనింగ్ చేసేందుకు వెండర్లు చర్యలు తీసుకునేలా ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా మిగిలిన దరఖాస్తులను త్వరితగతిన వెండర్ వద్దకు కమీషనింగ్ కు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తుదారులకు బ్యాంకుకు అనుసంధానం చేసి రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఉన్న 27 బ్యాంకులకు 27 గ్రామాలు కేటాయించి రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. పిఎం సూర్య ఘర్ పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం కల్పించి ప్రజల్లో అవగాహన తీసుకొని రావాలని ఎనర్జీ అసిస్టెంట్లను కలెక్టర్ ఆదేశించారు. బ్యాంకుల ద్వారా అందజేసే రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అదే విధంగా పాండురంగాపురం గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని పిఎం సూర్య ఘర్ పథకం క్రింద తీసుకొని రావాలన్నదే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీరు సుధాకర్ పాల్గొన్నారు.