పిల్లలకు స్మార్ట్ ఫోన్ దూరం చేయాలంటే క్రీడలు మంచి సాధనం
1 min read
తైక్వాండో క్రీడాకారులకు బ్యాగులు పంపిణీ చేసిన సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ.
కర్నూలు , న్యూస్ నేడు: అతిగా స్మార్ట్ఫోన్ వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాల నుంచి పిల్లలను దూరం చేయాలంటే క్రీడలు మంచి మార్గమని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న మున్సిపల్ పార్కులో సీనియర్ తైక్వాండో శిక్షకుడు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు ఆయన తన సొంత ఖర్చులతో బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం పిల్లలు స్మార్ట్ఫోన్ల ను అతిగా వినియోగిస్తున్నారని, దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులు అధికం అవుతున్నాయని చెప్పారు వాటి నుండి విముక్తి కలిగించాలంటే పిల్లలను చిన్నతనం నుంచి క్రీడల్లో పాల్గొనేలా చేయాలని ఆయన సూచించారు. స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల చిన్న పిల్లల్లో దురాలవాట్లు ప్రభలే అవకాశం ఉందని ఆయన చెప్పారు. స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల ఊబకాయం, ఒంటరితనం అధికమవుతాయని, సామాజిక సంబంధాలు కూడా కోల్పోతారని చెప్పారు. ఇలాంటి అలవాట్ల నుంచి పిల్లలను దూరం చేయాలంటే క్రీడల్లో ప్రోత్సహించాలని, దీనివల్ల దేహదారుఢ్యం, ఏకాగ్రత పెరుగుతుందని, ధ్యానం, యోగ వంటి ఆరోగ్యానికి ఉపయోగపడే అంశాలు క్రీడల్లో ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో ప్రోత్సహించడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అందుకే తాను కర్నూల్ లో మార్షల్ ఆర్ట్స్ ను ప్రోత్సహిస్తున్నానని చెప్పారు. కర్నూలు జిల్లా స్థాయిలో ఇలా ప్రోత్సహిస్తే, కర్నూలు భవిష్యత్తులో ప్రపంచ పటంలో నిలవాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు .క్రీడాకారులు ఆరోగ్యం కోసం పండ్లను తీసుకోవాలని, అలాగే నీటిని ఎక్కడపడితే అక్కడ తాగకుండా పరిశుభ్రమైన నీటిని తాగాలని చెప్పారు. కలుషితమైన నీటిని తాగడం వల్ల కలరా, టైఫాయిడ్ ,జాండీస్ వంటి ప్రమాదకర వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు అధికంగా ఉన్న నేపథ్యంలో క్రీడాకారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ సూచించారు.