5వ తేదీన మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టండి
1 min read
టెలికాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5వ తేదీన పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమంపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓలు, డిప్యూటీ సీఈఓ, మున్సిపల్ ఇంజనీర్లు, ఎంపిడిఓలు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు, జిల్లా అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎంపిడిఓలు, స్పెషల్ ఆఫీసర్లను కలెక్టర్ ఆదేశించారు. 489 గ్రామ పంచాయతీల్లో ప్రతి గ్రామ పంచాయతీలో 200 నుండి 250 మొక్కల చొప్పున లక్ష మొక్కలను నాటాలన్నారు. ఐదు మున్సిపాలిటీల పరిధిల్లో 30వేల మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ప్రతి పాఠశాలకు 30 మొక్కల చొప్పున 1300 ప్రభుత్వ పాఠశాలల్లో 39 వేల మొక్కలను నాటేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 21 ప్రభుత్వ కళాశాలల ఆవరణంలో 50 మొక్కల చొప్పున వెయ్యి మొక్కలు నాటించేందుకు చర్యలు తీసుకోవాలని డీవీఈఓ ను కలెక్టర్ ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో 40 వేల మొక్కలు నాటేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ డిఎఫ్ఓ లను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ ద్వారా హౌసింగ్ కాలనీలలో ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటి 20వేల లక్ష్యాన్ని పూర్తి చేయాలని హౌసింగ్ పిడిని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో 10 వేల మొక్కలు నాటాలన్నారు. ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, నేషనల్ హైవే పరిధిలో ఉన్న వసతి గృహాల్లో 5 వేల మొక్కలు నాటాలన్నారు. అదే విధంగా అన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాల ఆవరణలలో 75 వేల మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు.