సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్
1 min read
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు : విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.బుధవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ తెలుగుజాతి వైభవాన్ని ప్రపంచానికి చాటిన సుప్రసిద్ధ నటులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు జయంతి మహోత్సవ వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1923 సంవత్సరం మే 28 వ తేదీన నిమ్మకూరు గ్రామంలో ఆయన జన్మించడం జరిగిందన్నారు.. గుడివాడ ఆర్డీఓ గా తాను పని చేసిన సమయంలో నిమ్మకూరు గ్రామాన్ని సందర్శించడం జరిగిందన్నారు.. నిమ్మకూరులో సాధారణ కుటుంబంలో జన్మించిన ఎన్టీఆర్ సినీ రంగంలో మహానటుడిగా ఎదిగారన్నారు.. విద్యార్థి దశలో, రాజకీయ రంగంలో ఎన్టీఆర్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు.. ప్రతిభ ఉంటే అవకాశాలు వస్తాయని చెప్పేందుకు ఎన్టీఆర్ జీవితం మంచి ఉదాహరణ అన్నారు.. రాజకీయ ప్రవేశం చేసిన తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు..అనేక సంస్కరణలతో సంక్షేమ పాలన అందించారన్నారు..రెండు రూపాయలకే కిలో బియ్యం ఇస్తూ దేశంలోనే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు.. క్రమ శిక్షణ, పట్టుదల తో ఆయన జీవితంలో అనేక విజయాలు సాధించారన్నారు. రాజకీయ జీవితంలో విజయం సాధించి దాదాపు 7 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారన్నారు.. 72 సంవత్సరాల జీవిత కాలంలో ప్రభుత్వం నుండి పద్మశ్రీ ,ఫిలింఫేర్ అవార్డులు చాలా తీసుకున్నారన్నారు.సినిమా రంగంలో ఆయన చేసిన సినిమాలు, నటించిన పాత్రల ద్వారా జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పించాయన్నారు.. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలు ఒక సందేశాన్ని ఇస్తాయన్నారు.. సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి లాంటి సినిమాలు దేశభక్తి ని రగిలిస్తాయన్నారు.శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాంటి పాత్రల్లో ఆయనను చూసినప్పుడు దేవుడంటే ఇలాగే ఉంటాడని అనిపిస్తుందన్నారు.. దర్శకత్వం, నిర్మాతగా చేస్తూ, నటుడిగా మూడు, ఐదు పాత్రలు చేయగలుగుతున్నారంటే ఆయనలో ఉన్న ప్రతిభ, వృత్తి పట్ల ఉన్న మక్కువను తెలుసుకోవచ్చునని కలెక్టర్ ఎన్టీఆర్ గురించి కొనియాడారు.జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగిందన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు సామాన్య కుటుంబంలో జన్మించి అంచెల అంచెలుగా ఎదిగిన వ్యక్తి అన్నారు. తెలుగు ప్రజల హృదయాలలో ఎన్టీఆర్ స్థిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు..నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ పేద ప్రజల కోసం 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని జాయింట్ కలెక్టర్ ప్రశంసించారు. కళాకారుడు మద్దయ్య ఎన్టీఆర్ సినిమాల్లో ని పాటలను పాడి అందరినీ ఉల్లాస పరిచారు….సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.అంతకముందు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి కలెక్టర్ పూలమాలవేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో డిఆర్ఓ సి.వెంకటనారాయణమ్మ, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, సెట్కూర్ సీఈవో వేణుగోపాల్, జిల్లా టూరిజం అధికారి విజయ, జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్, జిల్లా అధికారులు, నగర కార్పొరేటర్ పరమేష్, పొదుపు గ్రూపుల మహిళలు, స్వచ్ఛంద సంస్థల తదితరులు పాల్గొన్నారు.
