వాణిజ్య సిలిండర్ ధర తగ్గించాలి
1 min read
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్
పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ధర్నా
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కేంద్ర ప్రభుత్వం పెంచిన వాణిజ్య సిలిండర్ ధర తగ్గించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. వాణిజ్య సిలిండర్ ధర పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో శనివారం సాయంత్రం స్థానిక పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వాణిజ్య సిలిండర్ ధర తగ్గించాలని, నిత్యవసర ధరలను నియంత్రించాలని కోరుతూ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న డేగా ప్రభాకర్ మాట్లాడుతూ గత 50 సంవత్సరాల లో ఎన్నడూ లేని విధంగా వాణిజ్య సిలిండర్ ధరపై ఏకంగా రూ.993 ధరను పెంచడం దుర్మార్గం అని విమర్శించారు. ఇప్పటికే ఈ ఏడాది సిలిండర్ ధరలు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మూడుసార్లు పెంచి పేద ప్రజల నడ్డి విరిచారని మండిపడ్డారు. ప్రజల రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లలో ధరల పెరుగుదలతో పాటు,రోడ్లపై చిన్న చిన్న చిరు వ్యాపారస్తుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యే పరిస్థితులు నెలకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజులలో గృహ అవసరాల సిలిండర్ రేటు కూడా జరిగే అవకాశాలు ఉందన్న ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ ఆసియాలో అమెరికా ఇరాన్ యుద్ధ ప్రభావం వలన పెట్రోల్ డీజిల్ కొరత ఉండదని నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని మోడీ కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కళింగ లక్ష్మణరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని విమర్శించారు. ఇప్పటికే ధరలు పెరుగుదలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, వాణిజ్య సిలిండర్ ధర పెరగడంతో రోడ్ల పక్కన చిరు వ్యాపారుల జీవితాలు దుర్భరంగా మారే ప్రమాదం ఉందన్నారు. పెరిగిన సిలిండర్ ధరను తక్షణమే ఉపసంహరించాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో సిలిండర్ ధర తగ్గించే వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ మోడీ ఎన్నికల సందర్భంగా తాను అధికారంలోకి వస్తే 100 రోజులలో నిత్యావసర ధరలు తగ్గిస్తానని చెప్పి, అధికారం చేపట్టిన తర్వాత ధరల పెరుగుదలను నియంత్రించకుండా పేదలను అణగతొక్కే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తక్షణమే వాణిజ్య సిలిండర్ ధర పెంచి పేద ప్రజలకు షాక్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు మాని,నిత్యా వసర ధరలను నియంత్రించి, వాణిజ్య సిలిండర్ ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్, కార్యవర్గ సభ్యురాలు కొల్లూరి సుధారాణి,గొర్లి స్వాతి,శాయన అభిలాష్ కుమార్, కౌన్సిల్ సభ్యులు కొండేటి రాంబాబు, తమ్మిశెట్టి రమణయ్య, జుజ్జువరపు సురేంద్ర, ఉప్పులూరి లక్ష్మి, కొండేటి మేరీ, మరడాని సత్యవతి,దాసిపల్లి ఎర్రయ్య, ఉప్పులూరి రాజామణి, పలువురు చిరు వ్యాపారస్తులు పాల్గొన్నారు.

