‘పది ‘ లో ప్రతిభా వంతులకు అభినందన
1 min read
జిల్లా కలెక్టర్ (ఇంచార్జి) నూరుల్ ఖమర్
కర్నూలు, న్యూస్ నేడు: ప్రభుత్వ పాఠశాల పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కుల సాధించిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ (ఇంచార్జి) నూరుల్ ఖమర్ అభినందించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్య సమస్యల పరిష్కార వేదిక పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో భాగంగా, ప్రభుత్వ పాఠశాల పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కుల సాధించిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ (ఇంచార్జి) అభినందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కాల్వబుగ్గ చదువుతూ ఎం. హర్షవర్ధన్ 593 మార్కులు, పి. చంద్రబాబు 588 మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. సాధారణ వనరులతోనే ఇంత ఉన్నత ఫలితాలు సాధించడం ప్రశంసనీయమని కలెక్టర్ తెలిపారు. ఈ విద్యార్థులు కష్టపడి చదివి తమ లక్ష్యాలను చేరుకోవడం ద్వారా ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అలాగే విద్యార్థుల విజయంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, వారి అంకితభావం మరియు మార్గదర్శకత వల్లే ఇలాంటి ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా పిల్లల విజయానికి బలమైన ఆధారమని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని, భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జి. సుధాకర్, ప్రిన్సిపాల్ ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు.

