ప్రభుత్వ సేవలను చివరి మైలు వరకు చేరవేస్తున్నాం
1 min read
“మన మిత్ర” సేవలపై గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు
సర్వీస్ రిక్వెస్ట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది
నంద్యాల జిల్లాకు కీలక పోస్టుల భర్తీ కోరిన జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
నంద్యాల,న్యూస్ నేడు: ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ, చివరి మైలు వరకు సమర్థవంతంగా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నివేదించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన 7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్ జిల్లాలో అమలవుతున్న పలు కార్యక్రమాల పురోగతిని వివరించారు.ప్రస్తుతం “స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు” కార్యక్రమం ద్వారా అందుబాటులో ఉన్న ఆన్లైన్ సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. “మన మిత్ర” ద్వారా అందిస్తున్న సేవలపై గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ చర్యల వల్ల చిన్నచిన్న పనుల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గి, గ్రామ స్థాయిలోనే సేవలు పొందుతున్నారని వివరించారు. సేవల వినియోగం పెరగడంతో సర్వీస్ రిక్వెస్ట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలను ఆధునిక సౌకర్యాలతో, క్రమబద్ధతతో మరియు పరిశుభ్రతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.బనగానపల్లెలో గృహ నిర్మాణాలకు సంబంధించిన లేఅవుట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, ఇందుకు సీసీఎల్ఏ అనుమతులు అవసరమని కలెక్టర్ వివరించారు. అలాగే “హౌసింగ్ ఫర్ ఆల్” పోర్టల్లో పాత లబ్ధిదారుల వివరాలు కొనసాగుతుండటంతో కొత్త దరఖాస్తుల సమయంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. గతంలో కేటాయించిన కొన్ని ఇళ్ల స్థలాలకు సంబంధించి కోర్టు కేసులు పెండింగ్లో ఉండటంతో పట్టాల పంపిణీ ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. అదేవిధంగా 2014-19 మధ్య మంజూరైన ఎన్టీఆర్ హౌసింగ్ పథకానికి సంబంధించిన బిల్లులు కూడా పెద్ద ఎత్తున పెండింగ్లో ఉన్నాయని సీఎం దృష్టికి కలెక్టర్ తీసుకువచ్చారు.ఈ సమస్యలపై స్పందించిన ముఖ్యమంత్రి, గృహ నిర్మాణాలకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితులు, అవసరాలు మరియు సమస్యలను సమగ్రంగా వివరించి సీసీఎల్ఏకు ఈ-ఫైల్ పంపించాలని అధికారులను ఆదేశించారు. ఫైల్ అందిన వెంటనే తగిన ఆదేశాలు జారీ చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

