కిడ్నీ వైఫల్యం… బాధితుడికి పునర్జన్మ..
1 min read
–60 కి పడిన బీపీ.. మధుమేహంతో బాధపడుతున్న రోగి…
- సీఆర్ఆర్టి తో.. సక్సెస్ చికిత్స…
– కర్నూలు కిమ్స్ వైద్యుల అరుదైన చికిత్స
కర్నూలు హాస్పిటల్, న్యూస్ నేడు : కిడ్నీ వైఫల్యం… రక్తపోటు పడిపోవడం… మధు మేహంతో బాధపడుతున్న రోగి ప్రాణాలు కాపాడటం చాలా కష్టమవుతుందని, అలాంటి క్లిష్ట పరిస్థితిలో సదరు రోగిని కర్నూలులోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు సకాలంలో సరైన చికిత్సతో కాపాడి కొత్త జీవితం ప్రసాదించారు. ఇందుకు సంబంధించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ & ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ కె. అనంత రావు వివరాలు వెల్లడించారు. ఆదోని కి చెందిన మల్లికార్జున (47) గత ఆరు నెలలుగా కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతడు డయాలసిస్ చేయించుకుంటున్నారు. అంతేకాకుండా కిడ్నీ మార్పిడి కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. కిడ్నీ వైఫల్యంతో అతడు తీవ్రమైన మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే చికిత్స జరుగుతున్న సమయంలో బిపి సాధారణంగా ఉండాలి కానీ అతనికి అకస్మాత్తుగా 120 ఉండాల్సిన బిపి 60కి పడిపోయింది. దీనిని సెప్టిక్ షాక్ గా పరిగణిస్తారు.
సీఆర్ ఆర్ టి … సక్సెస్ చికిత్స…
ఈ సమయంలో రోగికి ఫిట్స్ రావడంతో వెంటిలేటర్పై ఉంచాల్సి వచ్చింది. శరీరంలో ఆమ్లాల మోతాదు తీవ్రంగా పెరగడంతో అత్యవసర డయాలిసిస్ అవసరమైంది.అయితే బీపీ తీవ్రంగా తగ్గిన పరిస్థితుల్లో సాధారణ డయాలిసిస్ చేస్తే కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో సీ.ఆర్.ఆర్.టీ విధానం ద్వారా చికిత్సను అందించాం. దాదాపు 48 గంటల పాటు కంటిన్యూయస్ రినల్ రీప్లేస్మెంట్ థెరపీ ద్వారా నెమ్మదిగా డయాలిసిస్ నిర్వహించడంతో రోగి పరిస్థితి స్థిరపడింది. అనంతరం వెంటిలేటర్ తొలగించాం. ఇప్పుడతను సాధారణ స్థితికి చేరుకున్నారు. అనంతరం డిశ్చార్జ్ చేశాం. ఈ క్లిష్టమైన పక్రియలో నాతో పాటు క్రిటికల్ కేర్ నిపుణులు డా. రాజేష్ రెడ్డి, డా. శ్యామ్, డా. రవీంద్ర పాల్గొన్నారు.

