ఎస్డిపిఐ కార్యకర్తల సహకారంతో కాలనీలో నీటి సమస్యకు స్వయంగా పరిష్కారం
1 min read
అధికారుల నిర్లక్ష్యానికి ప్రజల ఐక్యతతో చెక్
స్వచ్ఛంద నిధులతో పైప్లైన్ మరమ్మత్తులు చేపట్టిన ఎస్డిపిఐ నాయకులు
రోడ్డు పనుల్లో దెబ్బతిన్న పైప్లైన్ మరమ్మత్తు – ఎస్డిపిఐ సహకారంతో కాలనీ ప్రజల చొరవ
హోళగుందన్యూస్ నేడు: రోడ్డు మరమ్మత్తు పనుల సమయంలో దెబ్బతిన్న నీటి పైప్లైన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీ ప్రజలకు, సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపిఐ) కార్యకర్తలు అండగా నిలిచి నీటి సమస్యను పరిష్కరించారు.మా కాలనీలో ఆర్ & బి శాఖ చేపట్టిన రోడ్డు మరమ్మత్తు పనుల సమయంలో నీటి పైప్లైన్తో పాటు విద్యుత్ వైర్లు కూడా దెబ్బతినడంతో బోరు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పటికే కాలనీలో త్రాగునీరు పది రోజులకు ఒకసారి మాత్రమే వస్తుండటంతో ప్రజలు పూర్తిగా బోరు నీటిపైనే ఆధారపడుతున్నారు. బోరు నీరు ఆగిపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ సమస్యను పలుమార్లు సంబంధిత పంచాయితీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, చివరకు ఎస్డిపిఐ కార్యకర్తలు స్వచ్ఛందంగా నిధులు సమీకరించి పైప్లైన్ మరియు ఇతర మరమ్మత్తు పనులు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ, ప్రజల ఐక్యతతో పాటు ఎస్డిపిఐ పార్టీ కార్యకర్తల సహకారం వల్లే సమస్యకు త్వరితగతిన పరిష్కారం లభించిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ కె. జావిద్ బాషా, వైస్ ప్రెసిడెంట్ కె. అబూబక్కర్, సెక్రటరీ బి. సైఫుల్లా, అలాగే కాలనీ వాసులు సులేమాన్, కైఫ్, భాష, ఈబీఆర్ అయ్యూబ్ తదితరులు పాల్గొన్నారు.

