పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలను ఉపసంహరించాలి
1 min read
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్
సిపిఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్
ఏఐటియుసి నగర అధ్యక్షులు కృష్ణమాచార్యులు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణం ఉపసంహరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద గల శీర్ల బ్రహ్మయ్య పెట్రోల్ బంక్ వద్ద సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రధాని మోడీ ఇప్పటివరకు దేశంలో సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని నమ్మబలికి ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తికాగానే చమురు ధరలు పెంచడం ప్రజలను వంచించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ పొదుపు చర్యలు ప్రకటించడానికి అసలు కారణం ధరల పెంపుదల కోసమేనని విమర్శించారు. ఇప్పటికే వంటగ్యాస్ ధర రూ.50,వాణిజ్య సిలిండర్ ధర రూ.1000 పెంచడం వలన సామాన్య మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.చిన్న, చిన్న టిఫిన్ సెంటర్లు,హోటళ్లు మూతపడి ఉపాధి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఇప్పుడు చమురు ధరలు పెంచడం వలన రవాణా రంగంపై పెను భారం పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలు మరింత పెరుగుతాయని అంతిమంగా పేద ప్రజలు ధరల భారాన్ని మోయాల్సి వస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గించే విధంగా ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే రైతులు కనీసం మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారని ఈ నేపథ్యంలో పెట్రోల్,డీజిల్ ధరలు పెంచడంతో రైతాంగంపై మరింత భారం పడుతుందని విమర్శించారు. రైతాంగ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని,లేనిపక్షంలో ప్రభుత్వమే సబ్సిడీ భరించాలని డిమాండ్ చేశారు.సిపిఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్, ఏఐటియుసి నగర అధ్యక్షులు కె.కృష్ణమాచార్యులు మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై మరింత భారాలు మోపేలా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. తక్షణం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.ఈ ధర్నాలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు భజంత్రీ శ్రీనివాసరావు, ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యురాలు కొల్లూరి సుధారాణి,కార్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఉప్పులూరి కేశవ రావు,బళ్ల కనకదుర్గారావు,బుగ్గల ప్రభాకర్, ఉప్పులూరి లక్ష్మి ,అమర్,ఎంఏ హకీమ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

