అంగన్వాడి ప్రీ ప్రైమరీ స్కూలును జిల్లా కలెక్టరు ఆకస్మిక తనిఖీ
1 min read
అంగన్వాడి సెంటర్లో మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలి,నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవు
నిర్ణీత వయస్సు దాటిన ప్రతి చిన్నారిని అంగన్వాడీ సెంటర్లో జాయిన్ చేయించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలి
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ముసునూరు మండలం వలసపల్లి గ్రామంలో శనివారం అంగన్వాడి ప్రీ ప్రైమరీ స్కూలును జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు. చిన్నారులతో మమేకమై కొన్ని ప్రశ్నలను వేసి సమాధానాన్ని రాబట్టారు. ఇదే గ్రామంలో రెండు అంగన్వాడీ సెంటర్లో పదిమందిని ప్రాథమిక పాఠశాలలో జాయిన్ చెయ్యుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సిడిపివో జిల్లా కలెక్టరుకు వివరించారు. ఈ రోజు మెనూ ప్రకారం ఫ్రైడ్ రైసును చిన్నారులతో కలసి రుచిచూసి, నాణ్యత లేదని జిల్లా కలెక్టరు అసహనం వ్యక్తం చేశారు. పునరావతం అయితే శాఖా పరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టరు హెచ్చరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ అంగన్వాడీ ఫ్రీస్కూలులో విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలో నూరుశాతం చేరికలు ఉండాలని అన్నారు. నిర్ణీత వయస్సు దాటిన ప్రతి చిన్నారిని అంగన్వాడి స్కూల్లో చేర్పించి,విద్యాబుద్ధులు నేర్పించాలని సూచించారు. అంగన్వాడి సెంటర్లో మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని, నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో లభించే ప్రయోజనాలుపై అవగాహన కల్పించి, వారిని ప్రభుత్వ పాఠశాలలు వైపు ఆకర్షించేలా చూడాలని అన్నారు. మెరుగైన మౌళిక సదుపాయాలు, సుశిక్షితులు అయిన టీచర్లు, ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు నోటు పుస్తకాలు పంపిణీని విద్యార్థులు తల్లిదండ్రులకి వివరించాలని అన్నారు. ఉచిత యూనిఫారాలు, డిజిటల్ క్లాసు రూమ్లు, నాణ్యమైన బోధన మరియు ఇంగ్లీష్ మీడియం, మధ్యాహ్న భోజనపథకం తదితర పథకాలను అవగాహన కల్పించి లక్ష్యాలను అధిగమించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, జెడ్పీ సిఈవో పి.జగదాంబ,జిల్లా పంచాయతీశాఖ అధికారి కె.అనురాధ, డివిజనల్ పంచాయతీ అధికారి యం.పి.యన్.సుందరి, తహశీల్దారు డి.ప్రశాంతి, ఇంచార్చి యంపిడివో బి.ఏ. సత్యనారాయణ,సిడిపివో పి.విజయకుమారి,అంగన్వాడీ టీచర్లు యం.కృష్ణ కుమారి, పి.కుమారి,గ్రామ సచివాలయ ఉద్యోగులు,అంగన్వాడి చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.

