ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు వైసీపీ జీర్ణించుకోలేకపోతుంది.. మంత్రి టీజీ భరత్ గుప్తా
1 min read
అన్నా క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి
కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు వైసీపీ జీర్ణించుకోలేకపోతుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. కర్నూలు సర్వజన ఆసుపత్రిలో ఉన్న అన్నా క్యాంటీన్ ను మంత్రి టీజీ భరత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం చేస్తున్న వృద్దులు, మహిళలతో మాట్లాడి సరిగ్గా భోజనం పెడుతున్నారా, రుచికరంగా ఉందా అని ఆరా తీశారు. సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండని పదే పదే అడిగారు. ఆ తర్వాత అన్నా క్యాంటీన్ పరిసర ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి ..ప్రజలకు భోజనం పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు ఈ ఆకస్మిక తనిఖీ చేశానని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రికి ఎంతో మంది ఇతర ప్రాంతాల నుండి వస్తుంటారని.. అన్నా క్యాంటీన్ లో పెడుతున్న భోజనం వల్ల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ”ఆహారం చాలా బాగుందని ప్రజలు చెబుతున్నారు. ఏ ఒక్కరిని అడిగినా పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ లను మూసివేసి అరాచక పాలన సాగించింది. మా ప్రభుత్వంలో పేదల ఆకలి అన్నా క్యాంటీన్ ద్వారా తీర్చుతున్నామని టీజీ భరత్ చెప్పారు. ఇక ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే వైసీపీ జీర్ణించుకోలేక పోతుందన్నారు.


