బడి పిలుస్తుంది – విద్యా చైతన్య రథంతో హొళగుందలో భారీ ర్యాలీ
1 min read
ప్రతి చిన్నారి బడిలో చేరాలి – మండల విద్యాశాఖ పిలుపు
హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండలంలో “బడి పిలుస్తుంది” కార్యక్రమంలో భాగంగా విద్యా చైతన్య రథం ద్వారా భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా 5 ప్లస్ విద్యార్థులను ఒకటో తరగతిలో చేర్పించాలని, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు 6వ తరగతిలో మరియు ఇతర విద్యార్థులు ఉన్నత తరగతుల్లో తప్పనిసరిగా చేరాలని సూచించారు.బడి బయట ఉన్న ప్రతి చిన్నారిని పాఠశాలలో చేర్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని విద్యాశాఖ అధికారులు పిలుపునిచ్చారు. విద్యార్థులతో కలిసి నిర్వహించిన భారీ ర్యాలీ గ్రామ ప్రజల్లో విద్యాపై చైతన్యం కల్పించింది. విద్యార్థులు నినాదాలతో గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించి ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సుధారాణి (ఎంఈఓ-1), కబీర్ సాబ్ (ఎఈఓ-2) పాల్గొన్నారు. అలాగే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలైన మెయిన్ స్కూల్, బీసీ హొళగుంద, ఆర్ నగర్, 10వ వార్డు, 6వ వార్డు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.వారితో పాటు సీఆర్పీలు (CRPs), MIS కోఆర్డినేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, IERT, MVF ఫౌండేషన్ ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పాఠశాల కమిటీ సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా మండల విద్యాధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యతో పాటు మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాంలు, షూస్, బ్యాగులు అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా విద్యార్థులు ఇంగ్లీష్ నేర్చుకునేందుకు డిక్షనరీలు కూడా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మంచి వాతావరణంలో నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారని, చదువుతో పాటు ఆటలు, పాటలు, పోటీలు వంటి సహ పాఠ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని వివరించారు. “ప్రతి చిన్నారి చదువుకోవాలి – ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా తీసుకోవాలి” అని అధికారులు పిలుపునిచ్చారు.


