కృతజ్ఞతాభివందనాలు…
1 min read
అమరావతి, న్యూస్ నేడు: మహానాడు 2026 విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కోట్లాది కుటుంబసభ్యుల ఆశీస్సులతో నేను టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైన తరువాత జరిగిన తొలి మహానాడు ఘన విజయం టీం టీడీపీ కృషి. సమష్టిగా పనిచేస్తే ఎన్ని అద్భుతాలు చేయగలమో టీడీపీ కుటుంబం నిరూపించింది. అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో నెల్లూరులో జరగాల్సిన మహానాడు 2026ను అందరి ఆమోదంతో హైబ్రిడ్ విధానంలోకి మార్చాం. తెలుగుదేశం రాజకీయ పాఠశాలలో గురువు చంద్రబాబు సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవడం మనకు నేర్పారు. ఆ నేర్పును ఇంటర్నేషనల్ క్రైసిస్లో కూడా ఎవరూ ఊహించని విధంగా హైబ్రిడ్ మహానాడును ఒక అవకాశంగా తీసుకుని విజయవంతం చేశారు. గతంలో మాదిరి ఒకచోట జరిగే మహానాడుకు తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ కుటుంబసభ్యులు తరలివచ్చేవారు. తెలుగుదేశం- నా బాధ్యత అంటూ ఇప్పుడు ప్రతీ పల్లె, ప్రతీ ఇల్లూ మహానాడుకు వేదికైంది. పసుపు జెండాలతో రెపరెపలాడింది. కార్యకర్తలే అధినేతలై, నేతలే మార్గదర్శులై రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్ల బాధ్యతలను తామే తీసుకుని మహానాడు 2026ను కనివినీ ఎరుగని రీతిలో విజయవంతం చేశారు. స్త్రీ శక్తి థీమ్కు అసలైన అర్థం చెప్పేలా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన తీర్మానానికి అందరి ఆమోదం లభించడం, దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం ఈ మహానాడు సాధించిన మరో గొప్ప విజయం. కార్యకర్తలే అధినేత నినాదాన్ని జాతీయ అధినేత అమలు చేసిన ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోతుంది. రెండు రోజుల మహానాడుకు ఒక్క MYTDP యాప్లో 24.50 లక్షల డిజిటల్ అటెండెన్స్ నమోదు కావడం మరో రికార్డు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, మహానాడు కమిటీలు, పార్టీ కార్యాలయ యంత్రాంగం, బ్యాక్ ఆఫీస్, సాంకేతిక సిబ్బంది, MYTDP, ITDP, అనుబంధ సంఘాలు, మీడియా మిత్రులు, సోషల్ మీడియా అభిమానులు, ఎన్ఆర్ఐలు, మిత్రపక్షాలు, ప్రజలు, భద్రతా సిబ్బంది అందరికీ కృతజ్ఞతాభివందనాలు. మహానాడు 2026 విజయం మీ అందరికీ అంకితం చేస్తున్నాను. ఇది మీ విజయం. మీ కృషికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

