షోలింగర్ యోగ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్
1 min read
షోలింగర్, న్యూస్ నేడు: తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహస్వామి వారిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ఈ ఉదయం షోలింగర్ కు చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోప్ వే మార్గంలో కొండపై ఉన్న ఆలయానికి చేరుకుని యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం చేసి శాలువాతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం యోగ నరసింహస్వామి ఆలయం సమీపంలోనే మరో కొండపై కొలువై ఉన్న శ్రీ యోగ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని మంత్రి సందర్శించారు. కాలినడకన 420 మెట్లు ఎక్కి యోగ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరిగివస్తూ మార్గమధ్యలో భక్తులను మంత్రి లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గురజాల జగన్మోహన్, డాక్టర్ కే.మురళీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

