అద్దె చెల్లించని మున్సిపల్ షాపులు సీజ్
1 min read
అద్దె చెల్లించని దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి
నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశం
కర్నూలు, న్యూస్ నేడు: గురువారం నగరపాలక సంస్థకు చెందిన షాపులను లీజుకు తీసుకుని అద్దెలు చెల్లించకుండా బకాయిలు పెంచుతున్న దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వాటిని సీజ్ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. గురువారం ఆయన కల్లూరు, రైల్వే స్టేషన్, ఎన్ఆర్ పేట, కొత్తపేట ప్రాంతాల్లో ఉన్న మున్సిపల్ షాపులను పరిశీలించారు.కొంతమంది లీజుదారులు షాపులను ఇతరులకు అద్దెకు ఇచ్చి అధిక మొత్తంలో వసూలు చేసుకుంటూ, కార్పొరేషన్కు చెల్లించాల్సిన అద్దెలను నిర్లక్ష్యం చేయడంపై కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ విధానం సరైనది కాదని లీజుదారులను హెచ్చరించారు.ప్రతి నెల 10వ తేదీలోపు అద్దెల వసూళ్లు పూర్తి చేయాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. కార్పొరేషన్ నిర్వహణ వ్యయాలు, ప్రజా సేవల నిర్వహణకు అద్దె ఆదాయం ఎంతో కీలకమని పేర్కొన్నారు. అద్దెల చెల్లింపులో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. మొండి బకాయిదారులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని, అవసరమైతే షాపులను సీజ్ చేయాలని ఆదేశించారు.అదేవిధంగా కమిషనర్ సెట్కూర్ కార్యాలయం సమీపంలోని అన్న క్యాంటీన్ను తనిఖీ చేశారు. అక్కడ అల్పాహారం చేస్తున్న ప్రజలతో మాట్లాడి ఆహార నాణ్యత, పరిశుభ్రత, సేవలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్ నిర్వహణ, పరిశుభ్రత పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.కార్యక్రమంలో ఆర్వోలు జునైద్, స్వర్ణలత, వాజిద్, ఆర్ఐలు రాజు, భార్గవ్, శానిటేషన్ ఇంస్పెక్టర్ కుర్మయ్య, అడ్మిన్లు తదితరులు పాల్గొన్నారు.

