లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
1 min read
టోల్ ఫ్రీనెంబరు1800-233- 2447 ను విస్తృతంగా ప్రచారం చెయ్యాలి
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లాలో గర్భస్థశిశు లింగనిర్ధారణ పరీక్షలను కట్టడి చెయ్యడానికి కఠిన చర్యలు తప్పవు అని జిల్లా కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో బుధవారం “పిసి& పిఎన్డిటి యాక్టు అమలు మరియు సరోగసీ చట్టం కమిటీ అమలుపై” సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో అమలులో ఉన్న పిఎన్డిటి చట్టాలుపై మరింత పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల్లో వైద్యసంబంధిత ఫిర్యాదులు,అక్రమ కార్యకలాపాలుపై సమాచారం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీనెంబరు 1800- 233-2447 ను విస్తృతంగా ప్రచారం చెయ్యాలని, అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లాలో తరచూ డీకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని, ప్రైవేటు స్కానింగు కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీలు చేసి నిబంధనలు అమలును పర్యవేక్షించాలని ఆదేశించారు. మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని మెడికల్ షాపులను తనిఖీ చెయ్యాలని, పూర్తి నివేదికలను అందించాలని సహాయ ఔషధ నియంత్రణ అధికారిని జిల్లా కలెక్టరు ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డా:యు.శోభ, జిల్లా వైద్యసేవలు సమన్వయ అధికారి డా:సి.హెచ్.బేబీ కమల,గైనకాల జిస్ట్ డా:భవాని,శిశువైద్య నిపుణురాలు డా:ప్రియదర్శిని, సహాయ ఔషధ నియంత్రణ అధికారి చక్రధర్,వివిధ శాఖలు జిల్లా అధికారులు పాల్గొన్నారు.


